50 చీనీ చెట్లు దగ్ధం
గుంతకల్లు రూరల్: మండలంలోని నాగసముద్రం గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి రైతు నాగేంద్ర తోటలోని 50 చీనీ చెట్లు కాలిపోయాయి. తనకున్న రెండు ఎకరాల్లో ఏడేళ్ల క్రితం 250 చీనీ మొక్కలను నాటాడు. మూడేళ్ల క్రితమే పంట దిగుబడి ప్రారంభమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్సర్క్యూట్ చోటు చేసుకుని నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటల చెలరేగాయి. కంచెకు అనుకుని ఉన్న 50 చీనీ చెట్లు కాలి పోవడంతో రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.
4న తిరుపతిలో
మెగా జాబ్మేళా
అనంతపురం టౌన్: తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో మార్చి 4న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్లో ఉత్తీర్ణులైన వారు అర్హులు.
అడవికి నిప్పు
కుందుర్పి: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో కుందుర్పి మండలం జంబుగుంపల అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసి పడ్డాయి. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలోని పచ్చని చెట్లు కాలి పోయాయి. పెద్దకొండ, మల్లికాసినకొండ, తుమర్లగొంది, కనుమ ప్రాంతాల్లో విలువైన టేకు, దాదారు, శ్రీగంధం, వెదురు, పచ్చారి, నీరద్ది, గాలిబుడుగు, నీలగిరి, తుమ్మ,జాతి వంటి విలువైన వృక్షాలు పూర్తిగా కాలిపోయాయి. వందలాది వన్యప్రాణులు సజీవ దహనమయ్యాయి. గురువారం సాయంత్రం సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ బీట్ అధికారి పరమేశ్వరప్ప, సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేపట్టారు. అయినా అదుపులోకి రాలేదు.
కళ్యాణదుర్గం మున్సిపల్
కమిషనర్పై ఫిర్యాదు
కళ్యాణదుర్గం: స్థానిక మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ అవినీతి అక్రమాలపై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్కు దళిత జన జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు.టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వంశీకృష్ణ భార్గవ్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు.
50 చీనీ చెట్లు దగ్ధం


