హిందూ ద్రోహి చంద్రబాబే
● పూజా విధానాలు తెలియని వారు ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరం
● వైఎస్సార్సీపీ నేత
జ్వాలాపురం శ్రీకాంత్ ధ్వజం
అనంతపురం: బూట్లు వేసుకుని పూజలు చేయడం, ఆలయాలను కూల్చి వేయడం లాంటి చర్యలతో అసలైన హిందూ ద్రోహిగా సీఎం చంద్రబాబు ఖ్యాతిగాంచారని వైఎస్సార్సీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం అనంతపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీసం పూజా విధానాలపై అవగాహన లేని బుచ్చి రాంప్రసాద్ ఏ అర్హతతో వైఎస్ జగన్ను విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. పదవుల కోసం క్షుద్ర పూజలు చేసేవారి పక్కన నిలబడే రాంప్రసాద్.. బ్రాహ్మణత్వానికే కళంకం ఆపాదించారని విమర్శించారు. గతంలో టీడీపీ హయాంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన క్షుద్రపూజల ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హోమ ద్రవ్యాలకు, అవిస్సులకు తేడా తెలియకుండా మాట్లాడటం రాంప్రసాద్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పులివెందులలోని నందీశ్వర ఆలయంలో జరిగిన హోమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత నిష్టతో పాల్గొన్నారని, శాస్త్రోక్తంగా హోమ క్రతువులు నిర్వహించారని తెలిపారు. యాగానికి దుష్ట శక్తులు అడ్డు పడకుండా అక్షింతలు వాసన చూసి వెనక్కి వేస్తారనే విషయం కూడా తెలియకుండా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. హోమంలో కార్యవాది అయిన ఆలయ చైర్మన్ లేదా పాలకమండలి సభ్యులు మాత్రమే సతీసమేతంగా కూర్చుంటారనే కనీస జ్ఞానం కూడా విమర్శించే వారికి లేకుండా పోయిందన్నారు. హిందూ ధార్మిక ముసుగులో ఉన్న అసలైన ద్రోహులు టీడీపీ నేతలేనని పేర్కొన్నారు.దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువతోనే నేడు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని ఆలయాల్లోనూ ధూపదీప నైవేద్యాలు నిరంతరాయంగా అందుతున్నాయన్నారు. పూజలు, హోమ విధానాలపై కనీస అవగాహన పెంచుకున్న తర్వాతే మాట్లాడాలని, అనవసర విమర్శలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీడీపీ నేతలను హెచ్చరించారు.


