మద్యం రాసిన మరణగీతం
● అతిగా మద్యం సేవించి సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
గుత్తి: స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలోని బ్రాందీ షాపు వద్ద శుక్రవారం అతిగా మద్యం తాగి సీఆర్పీఎఫ్ జవాన్ వీరాంజి(34) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి మండలం ఇసురాళ్లపల్లికి చెందిన వీరాంజి హైదరాబాద్లో సీఆర్పీఎఫ్ జవాన్గా పని చేస్తున్నాడు. తన సోదరి కుమారుడి వివాహానికి రెండు రోజుల క్రితం గుత్తికి వచ్చాడు. అతిగా మద్యం సేవించి బ్రాందీ షాపు వద్దే పడి పోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వీరాంజి మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త చనిపోయాడనే సమాచారం తెలియడంతో భార్య నాగవేణి, బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. భర్త మృతదేహాన్ని చూసి నాగవేణి కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘ఏ మండీ నేను వచ్చాను.. పైకి లేవండీ..నీవు వెళ్లిపోతే నాకు దిక్కెవరం’టూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానుసారం మద్యం విక్రయిస్తుండడమే ఇలాంటి మరణాలకు కారణమని స్థానికులు మండిపడ్డారు.


