
‘పచ్చ’ నేత గోదాములో యూరియా అన్లోడ్
కణేకల్లు: మండలంలోని బెణికల్లు గ్రామంలో ఓ లారీ యూరియా లోడ్ను టీడీపీ నేత రమేష్ గోదాములో అన్లోడ్ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ప్రశ్నించిన రైతులపై ‘పచ్చ’ నేత రెచ్చిపోవడమే కాకుండా వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి చేశాడు. వివరాలు.. ఇటీవల బెణికల్లు హెచ్చెల్సీ ఆయకట్టులో వరినాట్ల ప్రక్రియ ఊపందుకుంది. యూరియా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం బెణికల్లు ఆర్ఎస్కేకు లారీలో యూరియా బస్తాలు పంపారు. వర్షం వచ్చి ఆర్ఎస్కే వద్ద గుంతలు పడటంతో లారీ ఇరుక్కుపోతుందని భావించిన వ్యవసాయశాఖ అధికారులు మరోచోట అన్లోడ్ చేయాలనుకొన్నారు. పాత గ్రామ పంచాయతీ కార్యాలయం అందుబాటులో ఉన్నా టీడీపీ నేత ప్రోద్బలంతో ఆయన గోదాములో యూరియా అన్లోడ్ చేయాలని నిర్ణయించి లారీని అక్కడికి పంపారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు గోదాము వద్దకెళ్లి వీఏఏ శ్రావణితో వాగ్వాదానికి దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ఉండగా టీడీపీ నేత గోదాములో ఎలా అన్లోడ్ చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు సూర్యనారాయణరెడ్డి, భీమిరెడ్డి ప్రశ్నించారు. దీని వెనుకున్న ఆంతర్యమేమిటని నిలదీశారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత రమేష్ రెచ్చిపోయాడు. ‘ప్రభుత్వం మాది.. మా ఇష్టమొచ్చినట్లు చేస్తాం.. ఇష్టమొచ్చిన చోట దింపుతాం.. నీదేందిరా’ అంటూ సూర్యనారాయణపై దాడి చేశాడు.
టీడీపీ వారికి పంపిణీ చేయాలనే..
తమకు అనుకూలంగా ఉన్నోళ్లకి యూరియా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకుడు తన గోదాములో అన్లోడ్ చేయించారని వైఎస్సార్సీపీ నాయకులు సూర్యనారాయణరెడ్డి, భీమిరెడ్డి, సంగప్ప ఆరోపించారు. ప్రయివేటు గోదాములో అన్లోడ్ చేయడం తప్పని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు తమ పార్టీకి అనుకూలురైన రైతులు అక్కడికెళ్లి యూరియా తీసుకోరనే విషయం తెలిసే తమ గోదాముల్లో దింపుకుంటున్నారన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా యూరియా పంపిణీ చేయాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
విలేకర్లతో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు
టీడీపీ నేత రమేష్ గోదాములో యూరియా బస్తాలు అన్లోడ్ చేస్తున్న దృశ్యం
ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
‘మా ప్రభుత్వం... మా ఇష్టం’ అంటూ రెచ్చిపోయిన ‘పచ్చ’ నేత
వైఎస్సార్సీపీ నాయకుడు సూర్యనారాయణరెడ్డిపై దాడి

‘పచ్చ’ నేత గోదాములో యూరియా అన్లోడ్