
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి
● వృద్ధుడి మృతదేహంతో గుత్తి సీహెచ్సీ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
గుత్తి: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మారెప్ప మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు గుత్తిలోని కమ్యూనిటీ వైద్యశాల ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు.. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పెద్దవడుగూరు మండలం గుత్తి వెంకటాంపల్లి గ్రామానికి చెందిన మారెప్ప(60)ను కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం గుత్తిలోని సీహెచ్సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో జ్వర తీవ్రత మరింత ఎక్కువైంది. విషయాన్ని వైద్యులకు తెలిపినా వారు సకాలంలో స్పందించలేదు. ఈ క్రమంలో సాయంత్రం మారెప్ప మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మారెప్ప మృతదేహంతో ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు. ఆందోళనకు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంజన్ ప్రసాద్ మద్దతు పలికారు. సమాచారం తెలుసుకున్న అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు సురేష్, గౌతమ్, హెడ్ కానిస్టేబుల్ హనుమంతు తదితరులు ఆస్పత్రికి చేరుకుని మృతుడి భార్య రామాంజినమ్మ, కుమారుడు ఓబులరాజు, కుటుంబ సభ్యులు, బంధువులతో చర్చించారు. ఇక్కడికి రాకముందే మరో ఆస్పత్రిలో చికిత్స చేయించారని ఆస్పత్రి సూపరిండెండెంట్ డాక్టర్ యల్లప్ప తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే మారెప్ప మృతికి కారణమంటూ ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
సరుకుల పంపిణీపై ఆరా
తాడిపత్రి రూరల్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏ మేరకు సరుకులు పంపిణీ చేశారో వివరాలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లను ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఆదేశించారు. కేంద్రాల వారీగా పంపిణీ వివరాలు ఇవ్వాలని అంగన్వాడీ సెక్టార్ వాట్సాప్ గ్రూపుల్లో సమాచారాన్ని పోస్టు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సరుకుల పంపిణీలో నెలకొన్న గందరగోళంపై ఈ నెల 17న ‘అందని అంగన్వాడీ సరుకులు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన అధికారులు కార్యాచరణను చేపట్టారు. యాప్ల భారంతో ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు తమకు 2018లో ఇచ్చిన సెల్ఫోన్లను అధికారులకు తిరిగి ఇచ్చారు. సెల్ఫోన్లు లేకపోవడంతో ఎఫ్ఆర్ఎస్ ద్వారా లబ్దిదారులకు సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ఈ పంపిణీపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అదేశాలు రాకపోవడంతో టీచర్లు సరుకుల పంపిణీ చేయలేదు. గుడ్లు, పాలు చెడిపోయే అవకాశం ఉండటంతో కొన్ని చోట్ల యూనియన్ నాయకుల సూచనల మేరకు సరుకుల పంపిణీ జరిగింది. ఉన్నతాధికారుల నుంచి సరుకుల పంపిణీపై అధికారికంగా ఎలాంటి అదేశాలు రాకపోయిన సరుకుల పంపిణీ చేశారన్న దానిపై జిల్లా అధికారులు సమాచార సేకరణలో పడ్డారు. ఐసీడీఎస్ పీడీ నాగమణి మాట్లాడుతూ... ఎఫ్ఆర్ఎస్ లేకుండా సరుకుల పంపిణీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్యులు అందలేదన్నారు. ఉత్తర్వులు వచ్చిన తరువాత పంపిణీపై ఆదేశాలిస్తామన్నారు. ఇప్పటికే పలుచోట్ల సరుకుల పంపిణీ చేశారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి