
సౌత్జోన్ సీనియర్ ఉమెన్ క్రికెట్ టోర్నీ విజేత చిత్త
అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ స్టేడియం వేదికగా ఈ నెల 11 నుంచి జరుగుతున్న సౌత్ జోన్ సీనియర్ ఉమెన్ క్రికెట్ టోర్నీ విజేతగా చిత్తూరు జిల్లా జట్టు నిలిచింది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. సోమవారం చిత్తూరు, కడప జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల నష్టానికి కడప జట్టు 101 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు కేవలం 17.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 101 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. చిత్తూరు 9 వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని కై వసం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో చిత్తూరు జట్టు నిలవగా, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో కర్నూలు, నాల్గో స్థానంలో కడప, ఐదో స్థానంలో నెల్లూరు జట్లు నిలిచాయి. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి వి.భీమలింగారెడ్డి అందజేశారు.
జేవీవీ జిల్లా కమిటీ ఎంపిక
అనంతపురం కల్చరల్: శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించే దిశగా జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) జిల్లా నూతన కమిటీని ఎంపిక చేసినట్లు జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్ వెల్లడించారు.సోమవారం జేవీవీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎంపిక చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడిగా కన్నేపల్లి చిత్తప్ప, ఉపాధ్యక్షులుగా రామిరెడ్డి, శివానంద, శశికళ, ప్రసాదరెడ్డి, రాజన్న, నాగరత్న, ప్రధాన కార్యదర్శిగా కెంచాల వీర్రాజు, కార్యదర్శులుగా తిరుపాల్, తిప్పేస్వామి, రాఘవేంద్ర, సింఽహాద్రి, రంగనాథ్, రామచంద్రయ్య, కోశాధికారిగా మహమ్మద్ జిలాన్, గౌరవాధ్యక్షులుగా డాక్టర్ రంగన్న, డాక్టర్ ప్రసూన, సాకే భాస్కర్, గౌరవ సలహాదారులుగా మల్లికార్జున, వీకే పద్మావతిను ఎంపిక చేసినట్లు వివరించారు. అలాగే సబ్ కమిటీల కన్వీనర్లలో వైద్య కమిటీకి లక్ష్మీనారాయణ, విద్యా కమిటీకి గాంగేనాయక్, సమతా కమిటీకి రాధాప్రసాద్, ఆడిట్కు శ్రీనివాసరావు, కల్చరల్ కమిటీకి వెంకచల రామిరెడ్డి తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జేవీవీ భవిష్యత్ కార్యాచరణపై పలు తీర్మానాలను ఆమోదించారు.
బస్సులో ప్రయాణికుడి మృతి
బుక్కరాయసముద్రం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బాబావలి (65) అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి సోమవారం ఉదయం కడప వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. బీకేఎస్ వద్దకు చేరుకోగానే సీటులో కూర్చొన్నట్టుగానే కిందకు వాలిపోయాడు. గమనించిన ప్రయాణికులు అప్రమత్తం చేయడంతో బస్సును ఆపి డ్రైవర్, కండెక్టర్ పరిశీలించారు. గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా నిర్ధారించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.