
సంబరాలు చేసుకునేందుకు సిగ్గుండాలి
● ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి
గుంతకల్లు: ‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నాయకులు అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతూ రిగ్గింగ్ చేసి గెలిచారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటప్పడు టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకునేందుకు సిగ్గుపడాలని’ ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి విమర్శించారు. శుక్రవారం ఆయన గుంతకల్లుకు విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ తరుఫున ఏజెంట్లు లేరని, కనీసం ఓట్లు వేయడానికి వచ్చే ఓటర్లును కూడా అడ్డుకోవడం దారుణమన్నారు. కాళ్లపై పడినా కనికరం లేకుండా ఓటు వేయాడానికి అనుమతించకపోవడం చూస్తుంటే తాలిబన్ల పాలనను రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. టీడీపీకి వత్తాసు పడిన పోలీసు డిపార్టుమెంట్ తలదించుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని మంత్రి నారా లోకేష్ అనడం సిగ్గుచేటన్నారు. పవన్కళ్యాణ్ పంచాయతీశాఖ మంత్రి ఉన్నా ఉపయోగం లేదన్నారు. పంచాయతీలకు నిధులు లేకపోవడంతో చిన్న పనులు కూడా సర్పంచులు చేయించలేకపోతున్నారు. అటు సినిమాలకు .. ఇటు రాజకీయాలకు కూడా ఆయన పనికిరాడన్నారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రసుత్తం కురుస్తున్న వర్షాలకు అమరావతి ప్రాంతం సముద్రంలా తయరైందన్నారు. ఈనాడు, జ్యోతి, టీవీ5లకు అమరావతి పరిస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
శ్రావణి మృతికి కారకులను శిక్షించాలి
అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకపోగా, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. కళ్యాణదుర్గంలో టీడీపీ నాయకులు, భర్త, వారి కుటుంబ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న శ్రావణికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని ఆ వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. శ్రావణి భర్త శ్రీనివాసులతో పాటు టీడీపీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ శర్మాస్వలి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృతురాలు శ్రావణి ఆడియో రికార్డు బయటకు వచ్చిందన్నారు. పోలీసులకు మూడుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆడియో స్పష్టంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం కారణంగానే తనకు ఈ పరిస్థితి ఏర్పడిందని, తన చావుకు టీడీపీనే కారణమని చెప్పారన్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో అనంతపురంలో యువతి హత్య, ఏడుగుర్రాలపల్లిలో మైనర్పై సాముహిక అత్యాచారం జరిగాయన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు సుజాతరెడ్డి, నాయకురాళ్లు శోభారాణి, అనురాధ, భారతి, చంద్రలేఖ, లీలావతి, అంజలి తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
హిందూపురం టౌన్: ‘మలుగూరు పంచాయతీ నందమూరినగర్లోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఒకేసారి 10 మందికిపైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వారికి వెంటనే మెరుగైన వైద్య సేవలందించాలి’ అని వైఎస్సార్ఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు కదిరీష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వారు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో సోమందేపల్లి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన మరువకముందే హిందూపురంలో ఒకేసారి పదిమందిపైగా విష జ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవడం బాధాకరమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రిన్సిపాల్, హౌస్ మాస్టర్లను సస్పెండ్ చేయాలన్నారు.

సంబరాలు చేసుకునేందుకు సిగ్గుండాలి

సంబరాలు చేసుకునేందుకు సిగ్గుండాలి