డాడీ.. ఫంక్షన్‌కు వెళ్లొస్తా! | - | Sakshi
Sakshi News home page

డాడీ.. ఫంక్షన్‌కు వెళ్లొస్తా!

May 2 2025 1:54 AM | Updated on May 2 2025 1:54 AM

డాడీ.. ఫంక్షన్‌కు వెళ్లొస్తా!

డాడీ.. ఫంక్షన్‌కు వెళ్లొస్తా!

అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘డాడీ... ఫ్రెండ్‌ సిస్టర్‌ ఫిక్షేషన్‌ ఫంక్షన్‌ ఉంది. నేనూ వెళ్లొస్తా’నంటూ కుమారుడు చేసిన కాల్‌ చివరిదవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. ఉదయం ఫోన్‌ చేసిన కుమారుడు.. మధ్యాహ్నం ప్రమాదంలో మృతి చెందినట్లుగా సమాచారం అందుకున్న వారి రోదనకు అంతులేకుండా పోయింది. తమ ఇంటి ఆశల సౌధం కుప్పకూలిందనే చేదు నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది అనంతపురం రూరల్‌ మండలం పంగల్‌రోడ్డు సమీపంలోని శిల్ప లేపాక్షి నగర్‌కు చెందిన ఉపాధ్యాయులు రవినాయక్‌, ప్రమీలాబాయి దంపతుల కన్నీటి వ్యథ.

వైద్యుడిగా వస్తాడనుకుంటే..

శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో బయలాజికల్‌ సైన్స్‌ టీచరుగా రవినాయక్‌, అదే జిల్లా ముదిగుబ్బ జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు టీచరుగా ప్రమీలాబాయి పని చేస్తున్నారు. వీరికి కుమార్తె నిహారిక, కుమారుడు అభిషేక్‌రాజ్‌ ఉన్నారు. నిహారిక ఇప్పటికే ఎంబీబీఎస్‌ పూర్తి చేసి సివిల్స్‌కు సన్నద్ధం అవుతోంది. అభిషేక్‌రాజు నెల్లూరులోని నారాయణ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వైద్యుడి మారి వస్తాడని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తారని ఎంతో ఆశతో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. బుధవారం తల్లిదండ్రులకు ఫోన్‌ చేసిన అభిషేక్‌ రాజు... తన స్నేహితుడి సోదరి వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి వెళుతున్నట్లు తెలిపాడు. కార్యక్రమం ముగించుకుని మధ్యాహ్నం స్నేహితులంతా కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలో దూసుకెళ్లి బోల్తాపడింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అభిషేక్‌రాజ్‌తో పాటు మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. ఈ విషయం తెలియగానే తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలయ్యారు.

అంత్యక్రియలు పూర్తి..

గురువారం ఉదయం శిల్పాలేపాక్షి నగర్‌లోని ఇంటికి అంబులెన్స్‌లో అభిషేక్‌ మృతదేహం తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. చుట్టుపక్కల కుటుంబాల వారు తరలివచ్చారు. అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా... వైద్య విద్యార్థులందరూ స్నేహితుడి ఇంట్లో శుభకార్యంలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 1.55 గంటలకు మెడికల్‌ కళాశాలలో తరగతికి వెళ్లాల్సి ఉంది. 25 నిముషాలు మాత్రమే సమయం ఉండడంతో అతివేగంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారన్న విషయం తెలియగానే అందరి హృదయాలు బరువెక్కిపోయాయి.

ఇదే భావి వైద్యుడి చివరి ఫోన్‌కాల్‌

నెల్లూరులో బుధవారం చోటు చేసుకున్న ప్రమాదంలో దుర్మరణం

జిల్లాకు చేరిన అభిషేక్‌రాజ్‌

మృతదేహం... అంత్యక్రియలు పూర్తి

కుమారుడి మృతిని తట్టుకోలేకపోతున్న తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement