కె.కోటపాడు : గొండుపాలెం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం బలవంతంగా రైతుల వద్ద నుంచి భూములను తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అన్యాయమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం అన్నారు. గొండుపాలెం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం సేకరిస్తున్న భూములను పరిశీలించి, ఆయా రైతులతో ఆదివారం లోకనాథం మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టంకు లోబడి ఎంఎస్ఎంఈ పార్కు కోసం గొండుపాలెంలో భూసేకరణ చేయలేదన్నారు. ముందుగా గ్రామసభను కుడా పెట్టకుండా రైతుల నుంచి భూములను తీసుకోవడం చట్టానికి విరుద్ధమని అన్నారు. రైతుల నుండి కారుచౌకగా భూములను తీసుకొని కంపెనీలకు కట్టబెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టుగా ఉందని లోకనాథం అన్నారు. రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తే సీపీఎం ద్వారా పోరాటం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గండి నాయినిబాబు, రొంగలి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.


