దేవరాపల్లి: మండలంలోని వెంకటరాజుపురం గ్రామ శివారు రాయపురెడ్డి కళ్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన రాయపురెడ్డి శ్రీరామమూర్తి, రాయపురెడ్డి శ్రీను పశువుల పాకలు దగ్ధమయ్యాయి. శ్రీరామమూర్తి పశువుల పాకలో నిల్వ చేసిన వంద బెల్లం దిమ్మలు, పాకకు ఆనుకొని ధాన్యం పురి, గడ్డివాము అగ్నికి ఆహుతయ్యాయి. పాడి గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో సమీప పశువుల పాకల వద్ద ఉన్న కొందరు రైతులు స్పందించి పశువులను విప్పేసి బయటకు విడిచిపెట్టడంతో అవి సురక్షితంగా బయటపడ్డాయి. స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి చేరుకోని వీలు లేకపోవడంతో రోడ్డుపైనే నిలిపివేయాల్సి వచ్చింది. స్థానిక రైతులు, గ్రామస్తులు మోటార్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేశారు. రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని స్థానికులు అంచనా వేస్తున్నారు. పశువుల పాకలు, బెల్లం దిమ్మలు, ధాన్యం, గడ్డి వాముల దగ్ధమవ్వడంతో తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.


