
పల్లకీ మోత!
సైబర్ క్రైం దోషికి
అచ్యుతాపురం సైబర్ సెంటర్ దర్యాప్తులో పోలీస్ అధికారి పాత్రపై సీఐడీ అనుమానం
అచ్యుతాపురం సమీపంలోని భోగాపురం గ్రామంలో ఉన్న ఈ అపార్ట్మెంట్లోనే అంతర్జాతీయ స్థాయి సైబర్ క్రైం జరిగేది.. ఈ ఏడాది మే 20వ తేదీన దాడులు జరపడానికి వెళ్లిన పోలీసు వాహనాలను చిత్రంలో చూడవచ్చు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా బీపీవో పేరిట అంతర్జాతీయ సైబర్ క్రైం వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ నేరం బయటకు రావడానికి చాన్నాళ్ల ముందే ‘వినాయకుడి’లాంటి ఓ పోలీస్ అధికారి వీరి దందాను గమనించి, దండిగా పిండుకున్నాడు. సీఐడీ విచారణలో ఈ పోలీస్ అధికారి ముడుపులపై ప్రాథమిక ఆధారాలు కూడా లభించినట్లు తెలిసింది. అయితే దర్యాప్తు మరింత లోతుల్లోకి వెళ్లకుండా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అడ్డుపడటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పసిగట్టి.. రూ.కోట్లు పట్టి!
అచ్యుతాపురంలో వంటి ప్రాంతంలో కాల్ సెంటర్(బీపీవో) ఏర్పాటుపై అంతా ఆహా ఓహో అనుకున్నారు. సదరు పోలీస్ అధికారి మాత్రం ఇలాంటి ప్రాంతంలో బీపీవో ఎలా? అన్న అనుమానంతో ఆరా తీయడం మొదలెట్టారు. ఏదో అడ్డగోలు వ్యవహారం నడుస్తుందనే కోణంలో నిర్వాహకుల్ని బెదిరించి మరీ నెలవారీ ముడుపులు, అప్పుడప్పుడూ భారీ మొత్తాలు కలిపి రూ.కోట్లలో వసూలు చేసినట్టు తెలిసింది. సైబర్ క్రైం బాధితులు పైస్థాయిలో ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక టీంతో విచారణ ప్రారంభించారు. అప్పటి వరకు ఇక్కడ జరుగుతున్న వ్యవహారం తెలిసినప్పటికీ ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరనీయకుండా సదరు పోలీస్ అధికారి చూసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఆధారాలు కూడా సీఐడీ విచారణలో లభించినట్టు తెలుస్తోంది.
టీడీపీ ఎమ్మెల్యే జోక్యంతో..!
టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రంగంలోకి దిగడంతో సీఐడీకి చేతులు కట్టేసినట్టయింది. సదరు ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికే చెందినవారు కావడంతో ఆ పోలీస్ అధికారి కులం కార్డు బయటకు తీశారు. దీంతో సదరు పోలీస్ అధికారి పేరు విచారణ నివేదికలో చేర్చకూడదంటూ సీనియర్ ఎమ్మెల్యే ఆదేశించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన నియోజకవర్గం కానప్పటికీ, ఆ ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంపై కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. పైగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోగొట్టిన సైబర్ క్రైం వ్యవహారంలో పాత్రధారిగా ఉన్న పోలీస్ అధికారిని ఎలా వెనుకేసుకొస్తారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సదరు ఎమ్మెల్యే కేవలం కులం కార్డు మాత్రమే కాకుండా భారీగా ముడుపులు కూడా తీసుకున్నట్లు పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కాల్ సెంటర్ కథాకమామీషు!
ముంబైకి చెందిన ఓ మహిళ అచ్యుతాపురంలో అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని బీపీవో పేరిట సైబర్ క్రైం సెంటర్ను ఏడాది కాలంగా నిర్వహిస్తోంది. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను ఇందులో ఉపయోగించుకున్నారు. పవన్ రెసిడెన్సీ వేదికగా సాగిన ఈ వ్యవహారంలో అవసరమైన స్టాఫ్ను హైదరాబాద్, గుజారాత్ల్లో రిక్రూట్ చేశారు. అమెరికన్ల ను వలవేసేందుకు ప్రత్యేకంగా అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్లో మాట్లాడేలా వీరికి తర్ఫీదు ఇప్పించారు. అమెరికా ఈ–కామర్స్ పేరుతో ఫోన్లు చేసి కూపన్లు వస్తాయంటూ ఎరవేసి డబ్బులు లాగేసేవారు. ఎవరైనా చెల్లించకపోతే తమదైన శైలిలో ఫేక్ వీడియోలతో భయపెట్టి రూ.50 కోట్ల వరకూ కొల్లగొట్టినట్టు తేలింది. ఇతర రాష్ట్రాలతో లింకులు ఉండటంతో పాటు లోతుగా విచారణ చేయాల్సిన కేసు కావడంతో సీఐడీ రంగంలోకి దిగింది. సీఐడీ విచారణలో ఓ పోలీస్ అధికారి సైబర్ క్రైం గురించి పక్కాగా తెలియనప్పటికీ.. ఏదో వ్యవహారం నడుస్తోందన్న సమాచారంతో భారీ వసూళ్లకు పాల్పడినట్టు తేలింది. అయినప్పటికీ సదరు పోలీసు అధికారిపై కేసు నమోదు చేయకుండా టీడీపీ ఎమ్మెల్యే జోక్యంతో వ్యవహారం సద్దుమణిగినట్టు సమాచారం.

పల్లకీ మోత!