డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన చాపరాయి జలపాతం, అరకు పైనరీలు పర్యాటకుల కలకలంతో కళకళలాడుతున్నాయి. గత రెండు వారాలుగా సందర్శకులు లేక బోసిపోయిన ఈ ప్రాంతాలు... శని, ఆదివారాలతో పాటు వినాయక చవితి సెలవు తోడవడంతో మైదాన ప్రాంతాల పర్యాటకులతో నిండిపోయాయి. మూడు రోజుల వరుస సెలవులు రావడంతో పర్యాటకులు కుటుంబసమేతంగా గిరిజన ప్రాంత అందాలను తిలకించేందుకు తరలివచ్చారు. దీంతో చాపరాయి, పైనరీ ప్రాంతాలలో పర్యాటకుల హడావుడి కనిపిస్తోంది. పర్యాటకులు గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి, థింసా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇక్కడ ప్రత్యేకం లభించే బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ కొనుగోలుకు పర్యాటకులు పోటీ పడుతుండటంతో మంచి డిమాండ్ ఏర్పడింది. గత రెండు వారాలుగా వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు పడిన స్థానిక వ్యాపారులు... ఈ మూడు రోజుల సెలవుల్లో పర్యాటకుల రాక పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


