హెచ్ఎంకు అప్పగించిన పోలీసులు
చింతపల్లి: మండలంలోని వంగసార గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి అనుమతి లేకుండా బయటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినులను పట్టుకుని, తిరిగి పాఠశాల అధికారులకు అప్పగించినట్లు డీఎస్పీ తిరుమలరావు తెలిపారు. ఈ నెల 12న పాఠశాలలో 8, 9 తరగతులకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్నం కాంపౌండ్ గోడ దూకి బయటకు వెళ్లిపోయారు. విషయాన్ని గమనించిన ప్రధానోపాధ్యాయులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్డీపీవో ఆదేశాల మేరకు చింతపల్లి, అన్నవరం ఎస్ఐలు వీరబాబు, సాయికుమార్ రంగంలోకి దిగి విద్యార్థినుల ఆచూకీ కనుగొన్నారు. ఆదివారం డీఎస్పీ ఆధ్వర్యంలో వారిని వంగసార పాఠశాలకు తీసుకువెళ్లి హెచ్ఎంకు సురక్షితంగా అప్పగించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మూడు రోజులు సెలవులు ఇచ్చినా తమను ఇంటికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతోనే గోడ దూకి వెళ్లామని విద్యార్థినులు తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పలాసి ప్రసాద్, సీఐ సింహాచలం, ఎస్ఐలు వీరబాబు, సాయికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


