జి.మాడుగుల: మండలంలోని సొలభం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సొలభం తాజా మాజీ సర్పంచ్ ఐసరం హనుమంతరావు, వైఎస్సార్సీపీ నాయకులు ఖండించారు. ఆదివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ... మండలంలోని ఎస్.కొత్తూరు, వనభరంగిపాడు, దబ్బగరువు, పెదబయలు, లకిడిలంక గ్రామాల నుంచి 100 మంది వైఎస్సార్సీపీ శ్రేణులు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సమక్షంలో టీడీపీలో చేరారని నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమన్నారు. సొలభం పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే పర్యటించిన సమయంలో ఆయా గ్రామాలకు చెందిన 9 మంది వలస కార్మికులను పిలిచి, టీడీపీ కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేవలం స్వార్థ రాజకీయాలు, స్వలాభం కోసమే ఇష్టం లేని వారికి కండువాలు కప్పి ఫోటోలకు పోజులిస్తున్నారని... ఇలాంటి డ్రామాలను నమ్మి ప్రజలు టీడీపీకి ఓటు వేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ నేతల స్పష్టీకరణ


