జి.మాడుగులలో పీహెచ్సీ ఎదుట నిరసన తెలుపుతున్న ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు
జి.మాడుగుల: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ శాంతియుత పోరాటం కొనసాగుతుందని అడ్మినిస్ట్రేటివ్ మెడిసిన్, హెల్త్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్. ప్రకాష్, కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్. బాలయ్య స్పష్టం చేశారు. జి.మాడుగుల మండలం పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం పీహెచ్సీల ఎదుట శాంతియుత నిరసన తెలిపారు. అనంతరం ప్రధాన రహదారిపై మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్డబ్ల్యూలు, కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ నాయకులు శంకరరావు, పీబీటీఎస్ దేవి, కె. నాగమణి, ఎస్కే లాలు, కొత్తదొర తదితరులు పాల్గొన్నారు.


