అరకులోయ టౌన్: పరిశుభ్రత, పర్యాటకులతో స్నేహపూర్వక వాతావరణమే లక్ష్యంగా బాధ్యతాయుతమైన యూత్ టూరిజంను ప్రోత్సహిస్తున్నామని జిల్లా పర్యాటక శాఖాధికారి పట్టాసి చలపతిరావు తెలిపారు. మంగళవారం మండలంలోని సుంకరమెట్ట సమీపాన ఉన్న ఎకో టూరిజం ఉడెన్ బ్రిడ్జి వద్ద ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ గెమ్మెలి కృష్ణబాబు ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక శాఖ ప్లాస్టిక్ నిర్మూలన, క్లీన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా పర్యాటకాధికారి చలపతిరావు మాట్లాడుతూ.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నెలకు ఒకరోజు ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తామని, పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఎకో టూరిజం ప్రాజెక్ట్లో ఉడెన్ బ్రిడ్జ్ నిర్వహణ, సిబ్బంది పనితీరు చాలా బాగుందని అభినందించారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో వి. ప్రసాద్ మాట్లాడుతూ.. పర్యాటక సిబ్బంది ప్రతి ఒక్కరూ పర్యాటకులతో ఎంతో బాధ్యతగా, స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్డీసీ రేంజర్ కె. అవేష, పంచాయతీ సిబ్బంది, ఉడెన్ బ్రిడ్జ్ ఉద్యోగులు, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.


