డుంబ్రిగుడ: ఆదివాసీలకు నూరు శాతం రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో బిల్లు పెట్టాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. సూర్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలదేవ్ మాట్లాడుతూ.. 1/70 చట్టం పరిరక్షణతో పాటు, జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో జారీ చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీని అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేసి బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. జీవో నంబర్ 3 రద్దు కావడం వల్ల గత మెగా డీఎస్సీలో గిరిజన యువత ఉద్యోగాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రెండు వేల మంది గిరిజనులకు ఉద్యోగాలు వచ్చినట్లు అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే ఆ రెండు వేల మంది ఎస్టీ టీచర్ల వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని సవాలు విసిరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం మండల నాయకులు సత్యనారాయణ, సురేశ్కుమార్, లైకాన్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.


