పాడేరు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రాథమిక ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని లెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్లో డీపీఓ, డీఎల్పీవో, ఆర్డీవో, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలతో ఆమె సమీక్షా నిర్వహించారు. జిల్లాలోని 244 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పన, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు తదితర అంశాలపై ఆమె మాట్లాడారు. ప్రతి మండలంలోనూ ఎంపీడీవోలు పోలింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ వంటి కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభించాలని సూచించారు. ఈనెల 25న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ. అనంతరం అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం గ్రామసభల్లో ఆమోదించాలని సూచించారు. వచ్చేనెల 7న అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో డీపీవో చంద్రశేఖర్, డీఎల్పీవో కుమార్, ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు.


