కశింకోట: స్థానిక జెడ్పీ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం నిండుకున్నాయి. దీంతో పక్కన అప్పుగా తెచ్చి భోజనం వండి వడ్డించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా 1వ తేదీకి మండలంలోని ఉగ్గినపాలెం వద్ద పౌర సరఫరాల శాఖ గిడ్డంగి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య మేరకు బియ్యాన్ని నేరుగా సరఫరా చేస్తున్నారు. ఈ నెల ఇప్పటి వరకు రాలేదు. గత నెలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం లేక పక్కనున్న సమగ్ర బాలికల వసతి గృహం నుంచి అప్పుగా తెచ్చి వండి పెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 600 మంది బాలికలు పాఠశాలలో చదువుతున్నారు. వీరికి సంఖ్య ఆధారంగా బియ్యం సరఫరా చేస్తుండటంతో అవి నెలాఖరుకు అయిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీని దృష్ట్యా అధికారులు సకాలంలో బియ్యం పాఠశాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మంగళవారానికి బియ్యాన్ని సరఫరా చేస్తామని గిడ్డంగి అధికారులను సంప్రదించగా తెలిపారని హెచ్ఎం ఎంఎస్ స్వర్ణకుమారి, ఇన్చార్జి హెచ్ఎం శశికళ తెలిపారు.


