వీధి కుక్కల దాడిలో మూడు లేగదూడలు మృతి
చోడవరం:చోడవరం పట్టణ శివారు ద్వారకానగర్లో శనివారం వీధి కుక్కలు దాడి చేయడంతో పాడి రైతులు జోగా శ్రీను, జోగా తలుపులకు చెందిన మూడు లేగదూడలు మృతి చెందాయి. నెలరోజుల కిందట కూడా ఇదే తరహాలో కుక్కలు దాడిచేసి ఒక గేదెపెయ్యిని చంపాయి. ఇటీవల చోడవరం పట్టణంతోపాటు అన్ని గ్రామాల్లోనూ వీధికుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి గుంపులుగుంపులుగా వీధుల్లో తిరుగుతూ స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మృతిచెందిన లేగదూడలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సీతారామస్వామి పరిశీలించారు. వీధికుక్కలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పంచాయతీ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.


