పాముకాటుతో బాలుడి మృతిపై సమగ్ర విచారణ
కశింకోట : ఇటీవల పాము కాటుతో మృతి చెందిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పాము కాటుకు గురైన బాలుడు కిరణ్ను తీసుకురాగా సిబ్బంది వైద్యం అందించకపోవడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ మోసయ్యపేటకు చెందిన తాతయ్య కొర్ని నాయుడు, అమ్మమ్మ గోవిందమ్మ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై పీహెచ్సీని శుక్రవారం సందర్శించి విచారణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్సీలో అత్యవసరమైన సేవలందించడానికి పాము, కుక్క కాటు వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒకవేళ వాక్సిన్ కొరత ఉంటే సబ్బవరం స్టాల్ నుంచి అందిస్తారన్నారు. అత్యవసరమైన వాక్సిన్ ప్రతి పీహెచ్సీల్లో అందుబాటులో ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు కూడా పీహెచ్సీలో 24 గంటలు సేవలందిస్తున్నామన్నారు. అలాగే జాతీయ రహదారికి దగ్గరలో ఉన్న ఈ పీహెచ్సీలో కూడా సేవలందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిబ్బంది కొరత కూడా లేకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రోగుల పట్ల సిబ్బంది సంయమనంగా వ్యవహరించాలని, అసభ్యకరంగా, దురుసుగా మాట్లాడితే సహించబోమన్నారు. ఎవరైనా ఈ విషయమై ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మరోసారి కలసి కిరణ్ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు.


