జీడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
దేవరాపల్లి: జీడి పంటకు మద్దతు ధర కల్పించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నాన్ షెడ్యూల్ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర డిమాండ్ చేశారు. మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు బోడిగరువులో స్థానిక జీడి రైతులతో కలిసి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడి పిక్కలకు మద్దతు ధర లేక రైతులు పడుతున్న కష్ట, నష్టాలను అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. కిలో రూ. 200 చొప్పున మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల నుంచి జీడిపిక్కల దిగుమతులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించక పోవడంతో దళారీ వ్యాపారుల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి పంటకు మద్దతు ధరతో పాటు మార్కెట్ సౌకర్యం కల్పించి, జీడి రైతుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు. జీడికి మద్దతు ధర కల్పించకుంటే జీడి రైతులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని దొర తెలిపారు. ఈ కార్యక్రమంలో పోయిరి రాము, దేవుడు, పోయిరి దారప్ప, కొనుసు రవీంద్ర, సీవేరి అప్పారావు తదితర గిరిజన జీడి రైతులు పాల్గొన్నారు.


