మార్చి 2న పంచదార్లకు జూపూడి రాక
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్లకు మాజీ ఎంఎల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రానున్నారు. పంచదార్లకు చెందిన దళితుల డీ పట్టా భూముల్ని రెవెన్యూ అఽధికారులు రికార్డు పరంగా స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో బాధిత దళిత రైతు కుటుంబాలకు చెందిన వారు 26 రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్నారు. ఎటువంటి పరిహారం ఇవ్వకుండా, దళిత రైతు కుటుంబాలకు చెందిన వారి సమ్మతి లేకుండా భూముల్ని స్వాధీనం చేసుకోవడంలో కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ దళిత రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వీరి నిరసనను రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం, కూటమి నేతలు కనీసం సంఘీభావం ప్రకటించకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు, దళిత సంఘాలు నిరసనకు అండగా నిలిచాయి. పంచదార్ల రైతులకు మరింత మద్దతు ప్రకటించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మాజీ ఎంఎల్సీ జూపూడి ప్రభాకర్ విచ్చేయనున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఐడీ బాబు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.


