టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
చింతపల్లి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బౌడు గంగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం చింతపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్లకు ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. చైల్డ్కేర్ లీవ్ నిబంధనల్లో డిపెండెంట్ క్లాజ్ను తొలగించాలని, ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరెండర్ లీవు బకాయిలను వెంటనే చెల్లించి, యాప్ల భారాన్ని తగ్గించాలని వారు కోరారు. అనంతరం వారు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దారుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా నేతలు దేపూరి శనికుమార్, ప్రసాద్ దొర, నాగేశ్వరరావు, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు లోచలి రామకృష్ణ, గెమ్మిలి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
బౌడు గంగరాజు డిమాండ్


