సంపూర్ణత అభియాన్తో జిల్లా అభివృద్ధి
సాక్షి, పాడేరు: ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి భాగస్వామ్యంతో సంపూర్ణత అభియాన్ 2.0 ద్వారా జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతామని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా మండల, జిల్లా స్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటూ, అభివృద్ధి సూచీలో జిల్లాను అగ్రస్థానానికి చేర్చడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వివరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, నీతి ఆయోగ్ ప్రతినిధి శ్రేయ, రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమి చైర్మన్ గంగులయ్య, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


