పునరావాస కాలనీలో పనులు వేగవంతం చేయాలి
నక్కపల్లి: నిర్వాసితుల కోసం ఏపీఐఐసీ ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం ఆమె జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్తో కలసి పెదబోదిగల్లంలో జరుగుతున్న పునరావాస కాలనీ పనులను పరిశీలించారు. నిర్వాసితులంతా కాలనీకి తరలి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిస్తే లబ్ధిదారులంతా కాలనీకి వస్తారన్నారు. ప్రారంభించిన ఇళ్లకు అవసరమైన సామగ్రి అంతా సిద్ధం చేయాలన్నారు. తాగునీరు, వాడుకనీరు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు డ్రైనేజీల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. స్టీల్ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం సేకరించిన నిర్వాసిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించి ఖాళీ చేయించాలని సూచించారు. మూలపర్ర, పాటిమీద గ్రామాల నిర్వాసితుల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీవో వి.వి.రమణ, ఏపీఐఐసీ జెడ్ఎం నర్సింగరావు, తహసీల్దార్ శ్రీను, తదితరులు ఉన్నారు.


