పోలీసులు నూతన దృక్పథంతో ముందుకు సాగాలి
ఆరిలోవ: మారుతున్న సాంకేతిక పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన దృక్పథంతో పోలీసులు ముందుకు సాగాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. కై లాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో 15 రోజులుగా జరుగుతున్న అనకాపల్లి జిల్లా ఏఆర్ బలగాల వార్షిక డీ–మొబలైజేషన్ ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఏఆర్ పోలీసులు ఆయనకు సాదర స్వాగత పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అనధికారిక సమావేశాలు, అనుమతి లేని ర్యాలీలు నియంత్రించేటప్పుడు అప్రమత్తంగా మెలగాలన్నారు. చట్టపరమైన నిబంధనల మేరకు శాంతియుతంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇక్కడ శిక్షణలో నేర్చుకున్న ఆయుధాల వినియోగం, బాంబ్ స్క్వాడ్ , మాబ్ కంట్రోల్ నైపుణ్యాలు విధి నిర్వహణలో వెన్నుముఖంలా నిలుస్తాయని చెప్పారు. విధి నిర్వహణలో ఉండి కుటుంబ బాధ్యతలను విస్మరించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, ఎస్బీ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మథరావు, ఆర్ఎస్ఐ ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.


