గుడిహత్నూర్: అత్తగారిపై కక్ష పెంచుకున్న ఓ అల్లుడు ఏకంగా ఆ ఇంటికే నిప్పుపెట్టిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కడమంచి రాజమణికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మండల కేంద్రానికి చెందిన వస్తాద్ అరుణ్ అనే యువకుడు రాజమణి చిన్న కూతురిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి రోజూ తాగి వచ్చి భార్యను కొడుతుండేవాడు. ఈనెల 8న రాజమణి ఇంటికి వచ్చిన అరుణ్.. భార్యతో పాటు ఇంట్లో వారిని చంపేస్తానని బెదిరించి వెళ్లాడు. భయాందోళనలకు గురైన రాజమణి, తన చిన్న కుమార్తెను తీసుకుని హైదరాబాద్లోని మరో కుమార్తె వద్దకు వెళ్లిపోయింది. దీంతో కోపం పెంచుకున్న అరుణ్ శనివారం రాత్రి రాజమణి ఇంటికి నిప్పుపెట్టాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


