జైపూర్: కల్లు తాగిన డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తిని గీత కార్మికుడు స్తంభానికి కట్టేశాడు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ అనాగరిక ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుందారం గ్రామానికి చెందిన ఎర్ర చంద్రయ్య అనాథ. ఇదే గ్రామానికి చెందిన గీత కార్మికుడు వొల్లాల మల్లాగౌడ్ వద్ద తాటికల్లు తాగేవాడు. ప్రతిఫలంగా ఆయన చెప్పిన పనులు, అవసరమైన పనుల్లో సహాయం చేసేవాడు. ఈ క్రమంలో రోజువారీగా ఆయన వద్ద పని చేస్తూ ఇచ్చిన ఆహారం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మల్లాగౌడ్ చెప్పిన పనులు చేయకపోవడంతో ఇంతకాలం తన వద్ద తాగిన కల్లుకు డబ్బులు ఇవ్వాలని చంద్రయ్యను స్తంభానికి కట్టేసి దాడి చేశాడు. ఇష్టారీతిగా దుర్భాషాలాడాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చివరికి స్థానికుల జోక్యంతో విడిచిపెట్టాడు. కాగా, చంద్రయ్య అనాథ కావడం, ఎవరూ లేకపోవడం వల్ల మల్లాగౌడ్ దాడి చేశాడంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


