బెల్లంపల్లి: పన్ను చెల్లించలేదని ఓ వ్యక్తి షాపును మంగళవారం మున్సిపల్ ఽఅధికారులు సీజ్ చేశారు. మున్సిపాలిటీలోని రణగంబాల బస్తీకి చెందిన కె.వెంకటరమణ సకాలంలో పన్ను చెల్లించకపోవడంతో మున్సిపల్ చట్టం 2009 ప్రకారం దుకాణాన్ని మున్సిపల్ కమిషనర్ జే.సంపత్ సీజ్ చేయించారు. పుర ప్రజలు సకాలంలో ఇంటి పన్ను చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని సూచించారు.
‘ఆకార్’ నేషనల్ ఫెస్ట్లో ప్రతిభ
బాసర: ఈ నెల 15న బాంబే ఐఐటీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘ఆకార్’ ఫెస్ట్లో బాసర ఆర్జీయూకేటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు ‘ఓపెన్ రోడ్స్ డిజైన్’ పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి సాధించారు. ఐఐటీ బాంబే, బెంట్లీ సిస్టమ్స్ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో సూపర్ లేటివ్ బృందంలో రిత్విక్ గోషికే, మనీషా బండారి, శివ సా యి, గణేశ్, ట్రాన్సిషన్ బృందంలో తేజస్విని మల్లోజు, అక్షిత్ రసపల్లి, సిరి, ట్రేల్ బ్రేజర్స్ బృందంలో మహేష్ గురుస్వామి, వైష్ణవి కర్నాటి, శ్రీకర్ పాల్గొన్నారు. సదరు విద్యార్థులను మంగళవారం వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, స్పెషల్ డ్యూటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్ అభినందించారు.


