సాత్నాల: కొరటా–చనాఖా సబ్ కెనాల్లో భాగంగా భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. భోరజ్ మండలం గిమ్మ పంచాయతీ కార్యాలయంలో ప్రాజెక్టు డి–14 సబ్కెనాల్లో భూములు కోల్పోతున్న రైతులతో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 2016 లో నిర్వహించిన సర్వే ప్రకారం ఎకరానికి రూ.10 లక్షల 40వేలు నెల క్రితం అకౌంట్లో జమ చేశారని, అయితే ఇప్పుడున్న ధరల ప్రకారం ఎకరానికి రూ.25 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొదటి సర్వే ప్రకారమే పనులు కొనసాగించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పరిహారం పెంపు విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, మనోహర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


