రంజన్ తయారీదారులకు దక్కని గుర్తింపు దశాబ్దాలుగా మారని కుమ్మరుల బతుకుచిత్రం
రంజన్ల తయారీలో మహిళ
రంజన్ తయారీలో మహిళలే కీలకం. మట్టి తీసుకువచ్చింది మొదలు పొడిగా మార్చడంతో పాటు వాటికి తుది రూపునిచ్చేది అతివలే. కుండ ఆకారాన్ని, తమకు వారసత్వంగా వస్తున్న కళతో ఒడుపుగా తీర్చిదిద్దుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తయారీలో నిమగ్నమవుతారు. రోజుకు 10 నుంచి 12 వరకు తయారు చేస్తామని తయారీదారులు చెబుతున్నారు.
మార్కెటింగ్ సౌకర్యం కరువు..
వీటికి వేసవిలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మంచి డి మాండ్ ఉంది. అయితే సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులకు వీరు త యారు చేసిన రంజన్లను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. దశాబ్దాలుగా కులవృత్తిని న మ్ముకున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రోత్సాహం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంజన్ల తయారీపై ఆధారపడి ఉన్న కుటుంబాలనుఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తయారీ ఎంతో ప్రత్యేకం..
రంజన్ల తయారీ వెనుక కుమ్మరుల హస్తకళా నైపుణ్యంతో పాటు ఎంతో శ్రమదాగి ఉంటుంది.వేసవికి ముందే అనుకూలమైన నల్ల మట్టినిదిగుమతి చేసుకుంటారు. మట్టి గడ్డలను కర్రలతో కొట్టి మెత్తని పొడిగా చేసి, ఎండబెడతారు. దానికి గుర్రపు లద్దిని కలిపి, మట్టిలో తగుపాళ్లలో మిశ్రమంలా మారుస్తారు. దానిని నీటితో తడిపి రంజన్ తయారీకి అనుగుణమైన ఆకృతిలో తీర్చిదిద్దుతారు. మహిళలు సలపతో కొడుతూ తుది రూపునిస్తారు. వాటిని పచ్చిదనం పోయేంతవరకు ఎండబెడతారు. తర్వాత వాటికి జాజును అద్దుతారు. అనంతరం భట్టీలో కాలుస్తారు. అందులోని లద్దిలోని చిన్న చిన్న గడ్డి ముక్కలు కాలిపోయి, కంటికి కనిపించని చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఇవే రంజన్ చల్లగా ఉండడానికి ప్రధాన కారణం.
వేసవి వచ్చిందంటే జనం తాపంతో అల్లాడి పోతారు. చల్లదనం అందించే
ఫ్రిజ్లు, కూలర్ల వైపు మొగ్గు చూపుతుంటారు. మరికొందరు మట్టి పాత్రలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో అందరికి గుర్తుకు వచ్చేది ఆదిలాబాద్ రంజన్. ఇప్పటికీ పేదవాడి ఫ్రిజ్కు ఆదరణ తగ్గలేదు. మరోవైపు ఈ మట్టి వస్తువుతో జిల్లాకు గుర్తింపు వచ్చినా.. వాటి తయారీలో కీలకమైన కుమ్మరుల బతుకులు మాత్రం మారకపోవడం గమనార్హం. – ఆదిలాబాద్


