బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే సిలిండర్ సమస్యలుంటే 1800 425 1939 నంబర్లో సంప్రదించాలి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎస్వో నందిని
కై లాస్నగర్: జిల్లాలో గృహావసరాలకు సంబంధించి గ్యాస్ కొరత లేదు.. ఇండెంట్ ప్రకారం ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి.. సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దు.. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకుంటే డోర్ డెలివరీ కొనసాగుతుంది.. సిలిండర్లను నిల్వ చేసినా, బ్లాక్ మార్కెటింగ్కు తరలించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.. గ్యాస్ సరఫరాలో ఎలాంటి సమస్యలున్నా టోల్ఫ్రీ నంబర్ 18004251939లో సంప్రదించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నందిని సూచించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు వివరాలు వెల్లడించారు.
సాక్షి: జిల్లాలో గ్యాస్ కొరత ఉందనే ప్రచారం సాగుతుంది.. ఇది వాస్తవమేనా..?
డీఎస్వో: కమర్షియల్ సిలిండర్ల కొరత ఉన్నమాట వాస్తవమే. కేంద్ర ప్రభుత్వమే ఆ సరఫరాపై ఆంక్షలు విధించింది. అయితే గృహావసరాలకు వినియోగించే గ్యాస్కు సంబంధించి ఎలాంటి కొరత లేదు. జిల్లా నుంచి పంపిన ఇండెంట్ ప్రకారం ఆయిల్ కంపెనీలు యథావిధిగా సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. దీనిపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
సాక్షి: కొరత లేకుంటే ఏజెన్సీల వద్ద నియోగదారులు ఎందుకు బారులు తీరాల్సి వస్తోంది.. దీనిపై ఎలాంటి దృష్టి సారించారు?
డీఎస్వో: వంటగ్యాస్కు ఎలాంటి కొరత లేదు. అయితే కొందరు గ్యాస్ దొరకదేమోననే ఉద్దేశంతో ముందస్తుగా ఏజెన్సీల వద్దకు వస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాం. బారులు తీరకుండా సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాం.
సాక్షి: గ్యాస్ బుకింగ్ కావడం లేదని వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. కారణమేంటి..?
డీఎస్వో: గ్యాస్ బుకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇది వరకు సిలిండర్ తీసుకున్న 21 రోజులకే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండేది. తాజా పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లోని వారికి 25 రోజుల గడువు పొడిగిస్తూ కేంద్రం నిర్ణ యం తీసుకుంది. ఈ ప్రకారమే వినియోగదారులు బుక్ చేసుకోవాలి. అందరూ ఒకేసారి బుకింగ్ చేసుకోవడంతో సర్వర్లో సమస్య తలెత్తింది. ఆందోళన చెందకుండా నిదానంగా బుక్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు.
సాక్షి: కమర్షియల్ గ్యాస్ సరఫరా లేకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు గృహావసర సిలిండర్లను వినియోగిస్తున్నారు. దీన్ని ఎలా కట్టడి చేస్తారు?
డీఎస్వో: వంటగ్యాస్ సిలిండర్లను వ్యాపారాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్సెంటర్లలో డొమెస్టిక్ సిలిండర్ల వాడకాన్ని నియంత్రించేలా రెవెన్యూ, పోలీస్ అధికారులకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. వారు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా వంటగ్యాస్ వినియోగించే వారిపై తగు చర్యలు తీసుకుంటారు.
సాక్షి: జిల్లాలో వంటగ్యాస్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి.. వినియోగం, సరఫరా పరిస్థితి ఎలా ఉంది?
డీఎస్వో: జిల్లా వ్యాప్తంగా 2,45,438 కనెక్షన్లు ఉ న్నాయి. వాటికి 17 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుంది. సగటున రోజుకు 2500 చొప్పున నెలకు సుమారు 70 వేల సిలిండర్ల విని యోగం అవుతుంది. తదనుగుణంగానే ప్రస్తుతం జిల్లాకు సి లిండర్లు సరఫరా అవుతున్నాయి. బుకింగ్ చేసుకు న్న వినియోగదారులకు రూ.992లకే డోర్ డెలివరీ చేయబడుతుంది. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు.
సాక్షి: కొంతమంది కృత్రిమకొరత సృష్టిస్తూ ప క్కదారి పట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది.. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
డీఎస్వో: ఈ పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఒక్కో ఏజెన్సీకి ఒక డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐల ను కలెక్టర్ నియమించారు. వారు బుకింగ్, సిలిండర్ల సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీల గోడౌన్లను తనిఖీ చేస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచినట్లు తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశముంటుంది.


