ఖానాపూర్: ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాధ, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన పెంచాల గంగాధర్ (45), కవిత దంపతులు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి పెళ్లయి 20 ఏళ్లు గడుస్తున్నా సంతానం లేకపోవడం, కుటుంబ సమస్యలు, అనారోగ్యంతో బాధపడేవాడు. వీటన్నింటికి తోడు చేసిన అప్పులు పెరిగిపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో సోమవారం అర్ధరాత్రి వేళ హన్మాన్ దీక్ష తీసుకునేందుకు గోదావరిలో స్నానం చేస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. గోదావరి తీరంలో గల షెడ్డులో ఉరేసుకున్నాడు. భార్య కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


