బాసర: బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో సోలార్ పీవీ టెక్నాలజీపై నాలుగు వారాల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. పునరుత్పాదక ఇంధన రంగంలో విద్యార్థులకు అవగాహన, ఆచరణాత్మక నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో ఈ శిక్షణ జరుగుతుంది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం కాగా, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమ ముఖ్యాంశాలు
సోలార్ ప్యానెళ్ల ఇన్స్టాలేషన్, సిస్టమ్ ఆపరేషన్, మెయింటెనెన్స్ వంటి అంశాలపై హ్యాండ్స్–ఆన్ శిక్షణ అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. భారత్ 2030 నాటికి 450 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంలో 300 జీడబ్ల్యూ వాటా సోలార్ రంగానికే ఉంది. ఈ భారీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి నైపుణ్యవంతమైన మానవ వనరుల అవసరం తీవ్రంగా ఉంది.
కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వి.చంద్రశేఖరరావు శిక్షణ లక్ష్యాలు, నాలుగు వారాల కార్యక్రమ వివరాలు పేర్కొన్నారు. మెకానికల్ విభాగం హెడ్ ఎ.చరణ్రెడ్డి సోలార్ రంగంలోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వైస్చాన్సలర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ. మురళీదర్శన్ ఈ కార్యక్రమాన్ని కొనియాడుతూ, అకడమిక్తో పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ అమిత్కుమార్ దేశ్పాండే, షేక్ ఆరిఫ్, సుబ్రహ్మణ్యం సిందే, దర్శన్లతో కూడిన సోలార్ పీవీ టెక్నాలజీస్ బృందం శిక్షణను పర్యవేక్షిస్తోంది. అసోసియేట్ డీన్లు డాక్టర్ కె.మహేశ్, శీలం శేఖర్, అనుపమ శ్రీదేవి, అన్పత్ రాహుల్తోపాటు విద్యార్థులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.


