కై లాస్నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఇబ్బందులు దూరం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలోనూ పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఉపాధి నిధులతో వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా జిల్లాకు 398 మంజూరు చేయగా ఇందులో ఇప్పటివరకు 70 నిర్మాణాలకు అధికారులు భూమి పూజ చేశారు. ఈ నెలాఖరులోగా మిగతా చోట్ల స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇబ్బందులను దూరం చేసేలా..
స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాల మంజూరు, పొదుపు డబ్బులు చెల్లించడం, రుణాల కిస్తీలు చెల్లింపు కోసం సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లా, మండల స్థాయిలో సమాఖ్యలకు భవనాలు ఉన్నాయి. గ్రామస్థాయిలో మాత్రం పక్కా భవనాలు లేక ఇబ్బందులు తప్పని సరిస్థితి. కొన్ని చోట్ల చెట్ల కింద, అంగన్వాడీ, సంఘం అధ్యక్షురాలి ఇంటి ఆవరణలో అవస్థల నడుమ నిర్వహించాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం వారి ఇక్కట్లను దూరం చేసేలా గ్రామస్థాయిలోనూ భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్) కింద ఒక్కో భవనాన్ని రూ.10 లక్షల వ్యయంతో 200 గజాల స్థలంలో నిర్మించనున్నారు.
ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలోనూ స్థలాన్ని ఎంపిక చేసి భవన నిర్మాణానికి భూమి పూజ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ సమాఖ్య సభ్యులు తమ పరిధిలో ప్రభుత్వ సూచన మేరకు అనువైన స్థలాన్ని గుర్తించి తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానాన్ని గ్రామసభ ఆమోదం కోసం పంచాయతీకి పంపించాలి. జీపీ ఆమోదం అనంతరం ఎంపీడీవోకు పంపుతారు. ఎంపీడీవో తహసీల్దార్ సంయుక్తంగా స్థలాన్ని పరిశీలించి ఎంపిక చేస్తే జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అనంతరం పంచాయతీరాజ్ అధికారులు నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో..
గ్రామీణ మండలాలు : 20
స్వయం సహాయక సంఘాలు : 10,990
గ్రామ సమాఖ్య సంఘాలు : 554
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు : 1,48,052
స్థలాల గుర్తింపు ప్రకారం పనులు
జిల్లాకు తొలి విడతగా 398 గ్రామ మహిళా స మాఖ్య భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఇప్పటివరకు అధికారులు స్థ లాల ను గుర్తించిన 78 భవనాల నిర్మాణాలకు మా ర్కౌట్ ఇచ్చాం. పనులు సాగుతున్నాయి. మిగతా చోట్ల కూడా స్థలాలను గుర్తించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం.
– రాథోడ్ శివరాం, పంచాయతీరాజ్ ఈఈ


