బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత
కై లాస్నగర్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఈ దురాచారాన్ని అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ‘ష్యూర్’ ఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి’ ప్రచార రథాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద మంగళవారం జెండా ఊపి ప్రారంచారు. అవగాహన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చట్ట ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండితేనే వివాహం చేయాలన్నారు. తక్కువ వయసు ఉన్న వారికి వివాహం చేయడం నేరమని, బాల్య వివాహం చేస్తే తల్లిదండ్రులు, బంధువులతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరినీ నేరస్తులుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. అనంతరం స్వయంగా సంతకం చేసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ఆర్డీవో స్రవంతి, జిల్లా సంక్షేమ అధికారి కె.మిల్కా, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయం సద్వినియోగం చేసుకోవాలి
నార్నూర్: యువత, విద్యార్థులు, పాఠకులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిజిటల్ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్యతో కలిసి మంగళవారం ప్రారంభించారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమంతో పాటు సరస్వతి మహిళా సమైక్య భవనంలో స్వశోధన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఐసీటీ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, ఐసీడీఎస్ పీడీ మిల్కా, నీతి అయోగ్ ప్రోగ్రాం అధికారి రాహుల్, తహసీల్దార్ జాడి రాజలింగు, ఎంపీడీవో పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.


