new platform
-
వెల్త్ మేనేజ్మెంట్లోకి ‘గోద్రెజ్’ ఎంట్రీ.. రూ.లక్ష కోట్లు టార్గెట్!
ముంబై: వినియోగ వస్తువులు, రసాయనాలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయం వంటి విభిన్న రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు వెల్త్ మేనేజ్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ’గోద్రెజ్ వెల్త్’ పేరుతో కొత్త వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. కంపెనీకి చెందిన ఆర్థిక సేవల సంస్థ గోద్రేజ్ కాపిటల్తో కలిసి ఈ వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఆర్థిక సేవలు అందిస్తుంది.గోద్రెజ్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణానికి (ఏయూఎం) సంబంధించి 30 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. 2026–27 ఆఖరు నాటికి రూ. 38,000 కోట్లను టార్గెట్గా పెట్టుకున్నట్లు సంస్థ ఎండీ మనీష్ షా తెలిపారు. వచ్చే అయిదేళ్లలో దీన్ని రూ. 1,00,000 కోట్లకు పెంచుకునే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్, గోద్రెజ్ ఫైనాన్స్ విభాగాల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న గోద్రెజ్ క్యాపిటల్ ఏయూఎం గత ఆర్థిక సంవత్సరం రూ. 28,000 కోట్లుగా నమోదైంది. వెల్త్ బిజినెస్ విభాగాన్ని ప్రారంభించిన సందర్భంగా షా ఈ విషయాలు తెలిపారు.ముందుగా ఎనిమిది కీలక నగరాలతో ప్రారంభించి వచ్చే మూడేళ్లలో ఈ వ్యాపారాన్ని 35 ప్రాంతాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా రూ. 2 కోట్లకు పైబడి అసెట్స్ కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు ఇది సరీ్వసులు అందిస్తుంది. ఇక గోద్రెజ్ క్యాపిటల్ ప్రస్తుతం 100కు పైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఈ ఏడాది 200 పైచిలుకు ప్రాంతాలకు విస్తరించనున్నట్లు షా వివరించారు. అలాగే సప్లై చెయిన్ ఫైనాన్స్, గోల్డ్ లోన్స్ సహా మూడు కొత్త వ్యాపార విభాగాలు ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. -
విదేశాల నుంచి భారత్కు డబ్బు: రెమిట్ ఫస్ట్ టు ఇండియా
ప్రవాస భారతీయులు విదేశాల నుంచి భారత్కు సులభంగా డబ్బులు పంపుకునేందుకు వీలుగా ‘రెమిట్ ఫస్ట్ టు ఇండియా’ ప్లాట్ఫామ్ను ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రవేశపెట్టింది. ఎలాంటి ఖర్చు లేకుండా, ట్రాన్స్ఫర్ ఫీజు లేకుండా డబ్బులు పంపుకోవచ్చని ప్రకటించింది.సింగపూర్కు చెందిన ప్రముఖ రిమిటెన్స్ సేవల సంస్థ సింగ్ ఎక్స్ భాగస్వామ్యంతో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించడం గమనార్హం. ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్ నుంచి డబ్బులు పంపుకునే (రెమిటెన్స్) సేవలు అందుబాటులో ఉండగా, త్వరలో మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్టు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది. -
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లోన్ కావాలా? అయితే..
చెన్నై: వివాహ బంధాలకు వేదికగా ఉన్న మ్యాట్రిమోనీ డాట్ కామ్ మరో అడుగు ముందుకేసింది. పెళ్లి వేడుకకు రుణం సమకూర్చేందుకు వెడ్డింగ్లోన్స్ డాట్ కామ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఐడీఎఫ్సీ, టాటా క్యాపిటల్, లార్సెన్ అండ్ టూబ్రో ఫైనాన్స్తో చేతులు కలిపింది.వివాహ ప్రణాళిక, బడ్జెట్, అమలు ప్రక్రియను సులభతరం చేయడానికి సేవలను విస్తరిస్తున్నట్టు మ్యాట్రిమోనీ డాట్ కామ్ సీఈవో మురుగవేల్ జానకిరామన్ తెలిపారు. ఈ సంస్థ పెళ్లిళ్ల కోసం రూ. 1 లక్ష నుండి రూ.1 కోటి వరకూ రుణాలను అందజేస్తుంది. నెలవారీ ఈఎంఐ కాలపరిమితి 30 సంవత్సరాల వరకు ఉంటుంది.2024లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన సమయంలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనాల ప్రకారం, నవంబర్ 12 నుండి డిసెంబర్ 16 మధ్య వివాహాలు జరిగే సీజన్లో దాదాపు 48 లక్షల జంటలు పెళ్లి చేసుకోనున్నాయి. -
పాత వస్తువులు కొత్తగా.. ఫ్లిప్కార్ట్ న్యూ ప్లాట్ఫామ్
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన అనంతరం.. పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫ్లిప్కార్ట్ అంతకముందు తాను దక్కించుకున్న ఈబే ఇండియాను మూసివేసింది. ఈబేను మూసివేసిన ఫ్లిప్కార్ట్.. రీఫర్బిష్డ్ గూడ్స్(పాతవాటినే మళ్లీ కొత్తగా మార్చిన వస్తువుల) కోసం సరికొత్త ప్లాట్ఫామ్ను తెరిచింది. అదే 2గుడ్. రీఫర్బిష్డ్ గూడ్స్ కోసం కంపెనీ ఏర్పాటు చేసిన తొలి ప్లాట్ఫామ్. వచ్చే ఐదు నుంచి ఆరేళ్లలో ఈ మార్కెట్ 20 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్ ఈ ప్లాట్ఫామ్ను తీసుకొచ్చింది. ఫ్లిప్కార్ట్ 2గుడ్ ప్లాట్ఫామ్ తొలుత రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఎలక్ట్రానిక్ యాక్ససరీస్ను అందుబాటులో ఉంచనుంది. ఆ తర్వాత హోమ్ అప్లియెన్స్కు కూడా దీన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ ప్లాట్ఫామ్ లైవ్గా కస్టమర్లకు అందుబాటులో ఉన్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఫ్లిప్కార్ట్ 2గుడ్ వస్తువును కొనుగోలు చేసిన తర్వాత 3 నెలల నుంచి 12 నెలల వారెంటీ ఇస్తుంది. మొబైల్ వెబ్ ద్వారా మాత్రమే తొలుత ఇది అందుబాటులో ఉంటుంది. కానీ తర్వాత తర్వాత డెస్క్టాప్ వెబ్ ఇంటర్ఫేస్, మొబైల్ యాప్ యూజర్లకు కూడా చేరువ చేయాలని ఫ్లిప్కార్ట్ యోచిస్తోంది. ఈబే ఇండియాను మూసివేసే సమయంలో ఈ కొత్త ప్లాట్ఫామ్ గురించి ఆ కంపెనీ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి ప్రస్తావించారు. ఈబే.ఇన్ నుంచి పలు విషయాలు బోధపడ్డాయని, అవే రీఫర్బిష్డ్ గూడ్స్ కోసం కొత్త ప్లాట్ఫామ్కు దోహదం చేసిందని పేర్కొన్నారు. ఆగస్టు 14 నుంచి ఈబే ఇండియా అధికారికంగా మూతపడింది. మార్కెట్ లీడర్గా.. ఫ్లిప్కార్ట్ మరింత షాపింగ్ అనుభవాన్ని అందించడానికే కృషిచేస్తుందన్నారు. రీఫర్బిష్డ్ గూడ్స్ మార్కెట్ విషయంలో ఉన్న నమ్మకపు లోపాన్ని తాము 2గుడ్ ద్వారా తొలగించనున్నామని పేర్కొన్నారు. సరసమైన ధరల్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అందజేస్తామని కల్యాణ్ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. -
కొత్త వేదికలతో కేరళ టూరిజం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏటా అయిదారు కొత్త ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నట్టు కేరళ టూరిజం వెల్లడించింది. ప్రస్తుతం 100కుపైగా కేంద్రాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ కె.పి.నందకుమార్ తెలిపారు. టూర్ ఆపరేటర్లు, ఏజెన్సీలతో కేరళ టూరిజం రోడ్షో నిర్వహించిన సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వైల్డ్లైఫ్, హిల్ స్టేసన్స్, బీచెస్, బ్యాక్వాటర్స్ వంటివి ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తు చేశారు. ఇందుకోసం పెద్ద ఎత్తున వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల వారు వివాహాలను కేరళలో జరపడం పెరుగుతోందని అన్నారు. ఇటువంటివి ఏటా 500లకుపైగా జరుగుతున్నాయని తెలిపారు. గతేడాది 10 లక్షల మంది విదేశీ, 1.35 కోట్ల మంది దేశీయ పర్యాటకులు కేరళలో అడుగు పెట్టారని చెప్పారు. 2015తో పోలిస్తే గతేడాది సెప్టెంబరులో పర్యాటకుల సంఖ్య 5–6 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. విభిన్న పర్యాటక ప్రదేశాలతో టూరిస్టుల సంఖ్య పరంగా దేశంలో కేరళ తొలి స్థానంలో ఉందని పేర్కొన్నారు.


