breaking news
nagarkarnul
-
ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు.. ప్రధాని మోదీ
సాక్షి,నాగర్కర్నూల్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించకముందే దేశ ప్రజలు తీర్పు ఇచ్చేశారని, మూడోసారి మోదీయే ప్రధాని అని నిర్ణయించారని ప్రధాని అన్నారు. శనివారం నాగర్కర్నూల్ బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చార్సౌ పార్( నాలుగు వందలు దాటి) అని నినదిస్తున్నారన్నారు. సభలో మోదీ మాట్లాడుతూ ‘ నిన్న(మార్చ్15) మల్కాజ్గిరి రోడ్ షోలో నిన్న జన ప్రవాహాన్ని చూశాను. యువకులు, మహిళలు, వృద్ధులు చాలా మంది రోడ్ల మీద నిల్చొని బీజేపీకి మద్దతు తెలిపారు. మల్కాజ్గిరిలో అద్భుతం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలపుడు బీఆర్ఎస్ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చూశాను. మోదీని మూడోసారి ప్రధాని చేయడానికి ఇప్పుడు అంతే ఉత్సాహంతో వేచి చూస్తున్నారు. గత పదేళ్లలో కేంద్ర పథాకాలు తెలంగాణ ప్రజలకు చేరకుండా అవినీతి, అబద్ధాల కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి. ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ అంబేద్కర్ను ఓడించింది. గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఓడించాలని చూశారు. కాంగ్రెస్ తెలంగాణలో ఎస్సీ వర్గానికి చెందిన ప్రస్తుత డిప్యూటీ సీఎంను కూడా ఇప్పుడు అవమానిస్తోంది. కాంగ్రెస్ నేతలు పైన కూర్చుంటారు. ఎస్సీ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెడతారు. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బాటలో వెళ్లే పార్టీనే. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ అని పిలుస్తారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి మోదీ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది. కానీ పదేళ్లలో తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నలిగిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల కలలను చిన్నాభిన్నం చేశారు. ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీలు గెలిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఆటలు సాగవు. ఇందుకే ఇక్కడ బీజేపీ ఎంపీలు గెలవాల్సి ఉంది. తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఎంపీలుంటే నేను మీకు చాలా సేవ చేయడానికి వీలవుతుంది. ఎక్కువ మంది ఎంపీలు గెలిస్తే మీ ఆకాంక్ష ఢిల్లీలో నాకు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓట్లు రెండింతలు చేశారు. ఈసారి బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లివ్వండి. నా ప్రసంగాలు ఎక్స్(ట్విటర్)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో తెలుగులో వినండి. కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాడు. అంబేద్కర్ను అవమానిస్తున్నాడు. దళితబంధుతో కేసీఆర్ దళితులను మోసం చేశాడు. బీఆర్ఎస్ దళితున్ని సీఎం చేస్తానని చేయలేదు. కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ స్కాముల్లో భాగస్వాములు, కాంగ్రెస్ 2జీ కుంభకోణం చేస్తే బీఆర్ఎస్ నీటి పారుదల ప్రాజెక్టులో అవినీతి చేసింది. రాష్ట్రం బయటికి వెళ్లి అవినీతి పార్టీలతో కలిసి అవినీతి చేశారు. ఈ నిజాలు రోజు మన ముందు బయటపడుతూనే ఉన్నాయి. మోదీ మీ దగ్గర ఓటు తీసుకుని కుటుంబ సభ్యులకు కుర్చీ ఇవ్వడు. వారి బ్యాంకు బ్యాలెన్సులు పెంచడు.140 కోట్ల మంది మోదీ కుటుంబ సభ్యులే. మోదీ కుర్చీలో కూర్చొని సుఖ పడడు. చాలా కాలం సీఎంగా, ఇప్పుడు పీఎంగా నాకు సేవ చేసే అవకాశమిచ్చారు. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నేను నా కోసం వాడుకోలేదు. నేను ఏమైనా చేశానంటే, రాత్రి పగలు కష్టపడ్డానంటే 140 కోట్ల మంది ప్రజల కోసమే. ఇందుకే మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ పూర్తి చేసే గ్యారెంటీ. ఆర్టికల్ 370 రద్దు చేస్తామంటే చేశాం. రాముడు సొంతింటికి వస్తాడని చెప్పాం. వచ్చాడు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రభాగంలో నిలిపాం. ఇది మోదీ గ్యారెంటీ . తెలంగాణలో పేదల కోసం ఒక కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం. తెలంగాణలో 1 కోటి 50 లక్షల మందికి బీమా చేశాం. తెలంగాణలో 67 లక్షల కంటే చిన్న వ్యాపారులకు ముద్ర రుణాలు వచ్చాయి. 80 లక్షల కంటే ఎక్కువ మందికి ఆయుష్మాన్ భారత్ లబ్ధి చేకూరింది. తెలంగాణ ప్రజలకు నేను మాటిస్తున్నాను. ఒక్క అవినీతి పరున్ని వదలను. అవినీతిపై పోరాడేందుకు నాకు ఆశీర్వాదం ఇవ్వండి. నాగర్కర్నూల్, సికింద్రాబాద్, మహబూబ్నగర్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించండి’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సభలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్రెడ్డి, నాగర్కర్నూల్, నల్గొండ, సికింద్రాబాద్, మహబూబ్నగర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఎండిన ఆశలు
కరువు కోరల్లో కందనూలు కరుణించని వరుణుడు వానలు రాక మొలకదశలోనే ఎండిన పంటలు చిత్తయిన మక్క రైతు, తేలిపోతున్న తెల్లబంగారం నష్టాల పాలవుతున్న రైతులు – నాగర్కర్నూల్: ఈ ఏడాది కూడా కరువు కన్నీళ్లను మిగిల్చింది. వరుణుడు మరోసారి రైతులను మోసం చేశాడు. వరుసగా మూడో ఏడాది కూడా నాగర్కర్నూల్ నియోజకవర్గంలో కరువు తిష్ట వేయడంతో మొక్కజొన్న చేతికందే పరిస్థితి లేదు. పత్తి పరిస్థితి మారీ దారుణంగా మారింది. అక్కడక్కడా కొద్దిపాటి చేలు పండినా నష్టమే మిగిలేలా ఉంది. ఈ ఏడాదైనా తమ జీవితాలు బాగుపడుతాయనుకున్న రైతుల ఆశలు మరోసారి అడియాశలు అవుతున్నాయి. మూడేళ్లుగా చేసిన అప్పులు ఈ సారి పంటలు పండించి తీర్చుకుందామని అనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. ఖరీఫ్ ఆరంభంలో కొంతమేర వర్షాలు పడడంతో సంతోషించిన రైతులు అప్పులు చేసి మరీ కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశారు. అయితే మొదట మురిపించిన వర్షం ముఖం చాటేయడంతో వేసిన పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలోకి రైతులను నెట్టివేసింది. జూన్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే కురిసినా జూలై మాసంలో చుక్క వర్షం కూడా పడలేదు. ప్రభుత్వం మాట విని మొక్కజొన్న సాగు భారీగా చేసినా, కంకిదశలో ఒక్క వర్షం కూడా పడకపోవడంతో పంట చేయి దాటిపోయింది. పత్తి రైతును నట్టేట మునిగే పరిస్థితి దాపురించింది. కంది, జొన్న, ఆముదం పరిస్థితి కూడా అలాగే ఉంది. పంటసాగు ఇలా.. నియోజకవర్గంలోని నాగర్కర్నూల్, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లో మొత్తం 71, 148హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో మొక్కజొన్న, వరి, పత్తి, ఆముదం, కంది వంటి పంటలు ఎక్కువగా సాగుచేశారు. ఇప్పటికే మొక్కజొన్న పూర్తిగా ఎండిపోయి వందశాతం నష్టం రైతులకు కలిగింది. నాగర్కర్నూల్ మండల నల్లవెల్లి, తెలకపల్లి మండలం రాకొండ, గడ్డంపల్లి మరి కొన్ని గ్రామాల్లో కరువును ముందే ఊహించిన రైతులు తమ పంట చేలను కోసి పశువులకు మేతగా వేస్తున్నారు. మండలాల వారీగా పరిస్థితి... నాగర్కర్నూల్ మండలంలో 7300హెక్టార్లలో మొక్కజొన్న, 3100హెక్టార్లలో పత్తి, 140 హెక్టార్లలో ఆముదం, 50హెక్టార్లలో వరి, 82హెక్టార్లలో జొన్న, 132హెక్టార్లలో కంది పంటలు పండించారు. ఇప్పటికే వర్షాలు లేక 80శాతం పంటలు పూర్తిగా ఎండిపోయాయి. దాదాపు నాగర్కర్నూల్ మండలంలోనే రూ.35 కోట్ల మేర రైతులు నష్టపోయి ఉంటారనేది అంచనా. – తెలకపల్లి మండలంలో 4369 హెక్టార్లలో మొక్కజొన్న, 6196 హెక్టార్లలో పత్తి, 68హెక్టార్లలో జొన్న, 149హెక్టార్లలో కంది, 37హెక్టార్లలో ఆముదం పంటలు సాగు చేశారు. మొక్కజొన్న, జొన్న పంట దాదాపు ఎండిపోయింది. మరో వారం రోజుల్లో వర్షాలు పడితే పత్తి, కంది పంటల వల్ల కనీసం పెట్టుబడులైనా వస్తాయి. ఈ మండలంలో దాదాపు రూ.27కోట్ల మేర రైతులు నష్టపోయి ఉంటారనేది అంచనా. మొక్కజొన్న పంటలు ఎలాగో చేతికి రావని అనుకున్న రైతులు ఇప్పటికే పొలాల్లో పంటలను తొలగించి, పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు. – తాడూరు మండలంలో 6500 హెక్టార్లలో మొక్కజొన్న, 3500హెక్టార్లలో పత్తి, 800హెక్టార్లలో కందులు, 50హెక్టార్లలో జొన్న, 100హెక్టార్లలో ఆముదం పంటలు సాగు చేశారు. అక్కడక్కడా మినహా పూర్తిగా ఎండిపోయింది. పత్తి పూత దశలోనే ఎదుగుదల ఆగిపోయింది. ఈ మండలంలో దాదాపు రూ.23కోట్ల నష్టం ఉంటుంది. – బిజినేపల్లి మండలంలో 9200 హెక్టార్లలో మొక్కజొన్న, 7400 హెక్టార్లలో పత్తి, 1000 హెక్టార్లలో జొన్న, 1200 హెక్టార్లలో కంది పంటలను సాగుచేశారు. ఏడాది గతం కంటే ఎక్కువగా సాగు చేశారు. మొక్కజొన్నలో కంకిదశలో ఎండిపోతుండగా, పత్తి పూత రాలుతోంది. ఇప్పటికే రైతులు దాదాపు రూ.40కోట్ల మేర నష్టపోయి ఉంటారని అంచనా. – తిమ్మాజీపేట మండలంలో 5531 హెక్టార్లలో మొక్కజొన్న, 5215 హెక్టార్లలో పత్తి, 278 హెక్టార్లలో వరి, 511హెక్టార్లలో జొన్న, 106 హెక్టార్లలో ఆముదం, 471 హెక్టార్లలో కందులు పండించారు. ఈ మండలంలో దాదాపు 25 కోట్ల మేర నష్టం జరిగింంటుందని అంచనా. పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య కరువు దెబ్బకు అప్పులపాలైన రైతులు తమ జీవితాలను వదులుకుంటున్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత దుర్భిక్షంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల క్రితం నాగర్కర్నూల్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్య ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. తన ఐదెకరాల పొలంలో మొక్కజొన్న సాగు చేయగా, అది పూర్తిగా ఎండిపోవడంతో పాటు గతేడాది చేసిన అప్పులు కూడా ఉండటంతో చేసేదేమి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షపాతం (జూన్, జూలై, ఆగస్టు 25వ తేదీ వరకు) (మిల్లీమీటర్లలో) మండలం సాధారణ కురిసిన లోటు వర్షం వర్షం నాగర్కర్నూల్ 298 195 103 తెలకపల్లి 277 134 143 తాడూరు 246 130 116 బిజినేపల్లి 313 125 188 తిమ్మాజీపేట 339 100 239 కాడి వదిలి కాటికి పోయే పరిస్థితి కాలం బాగుంటుందంటే అప్పులు చేసి పంటలు సాగు చేశాం. ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడులు పెట్టి పూర్తిగా నష్టపోయాం. ఇప్పుడు కాడి వదిలి అప్పుల్లో కాటికి పోయే పరిస్థితులు వచ్చాయి. మూడేళ్లుగా వరుస కరువుతో తీవ్రంగా నష్టపోయాం. పొట్ట చేతపట్టుకొని వలస పోవాల్సిన పరిస్థితి వచ్చింది. – వి.శివ, ఆనేఖాన్పల్లి తండా, కార్కొండ పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి యవసమే జీవనాధారంగా బతికే మాబోటి గిరిజన బతుకులకు ఆధారమైన పంటలు పూర్తిగా ఎండిపోయాయి. మూడేళ్ల కరువులో పొట్ట చేతపట్టుకొని సంపాదించిందంతా పంటలకే పోతుంది. చేసిన అప్పులు తీర్చలేక ఉన్న పొలాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి. కరువులో సర్కారు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. రెండేళ్లుగా పంటలు నష్టపోయిన నేటికీ రూపాయి కూడా అందకపాయే. – రాత్లావత్ లక్ష్షి్మ, బొర్సుగడ్డ తండా