breaking news
massive protest
-
ఫిబ్రవరిలో మహాధర్నా
సిరిసిల్ల: ఆటో కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం ఫిబ్రవరిలో హైదరాబాద్లో వారితో కలిసి మహాధర్నా చేస్తామని చెప్పారు. ఆటోడ్రైవర్లకు నెలకు రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.1,560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 5వేల మంది ఆటోడ్రైవర్లకు ఆత్మీయ భరోసా పేరిట రూ.5 లక్షల సొంత డబ్బులతో చేయించిన ప్రమాద బీమాకు సంబంధించిన కార్డులను బుధవారం ఆయన పంపిణీ చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు కేసీఆర్ అండ ‘ఆటో అన్నలతో బీఆర్ఎస్కు ఉన్న అనుబంధం కొత్తది కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో, పార్టీ అధినేత కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేసినప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో, ఆటో డ్రైవర్లు కూడా ముందుండి పోరాడారు. ‘తెలంగాణ కావాలే’అని ర్యాలీలు తీసి కేసీఆర్కు మద్దతుగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికులపై కేసీఆర్ తన ప్రేమను చాటుకున్నారు. రాష్ట్రంలోని సుమారు 6.5 లక్షల నుంచి 7 లక్షల మంది ఆటో కార్మికులు అడగకుండానే, పార్టీ మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగమాటలు చెప్పకుండానే రూ.5 లక్షల ప్రమాద బీమాను కల్పించారు. రైతుబీమాను తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చింది కేసీఆర్ ఒక్కరే. డ్రైవర్లకు, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన కార్మిక పక్షపాతి కేసీఆర్. ఆటో డ్రైవర్లతోపాటు అసంఘటిత రంగంలోని దాదాపు 13.50 లక్షల మంది డ్రైవర్లకు (వ్యాన్లు, జీపులు, ట్రాక్టర్లు, ట్యాక్సీలు, లారీలు) రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు బీమా ఊడగొట్టింది. మా ప్రభుత్వంలో మంచిగా దర్జాగా బతికిన ఆటో డ్రైవర్ మష్రత్ అలీ, రాహుల్గాంధీ ఇచ్చిన హామీలతో నేడు రెండు ఆటోలు అమ్ముకుని, కిరాయి ఆటో నడుపుకునే పరిస్థితి వచ్చింది..’అని కేటీఆర్ చెప్పారు. అవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలు ‘రాష్ట్రంలో మార్పు, మార్పు అంటూ జరిగిన మోసం ఎలా ఉంటుందో రెండేళ్లలో ప్రజలకు అర్థమైంది. రైతులు, యువత, మహిళలు సహా అందరికీ 420 హామీలు ఇచ్చి మోసం చేశారు. రైతు రుణమాఫీ చేయాలంటే రూ.50 వేల కోట్లు అవసరం ఉండగా.. రూ.12 వేల కోట్లు ఇచ్చి అయిపోయిందని ప్రచారం చేసుకున్నారు. దేవుళ్లపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్కో ఆటో డ్రైవర్కు ప్రభుత్వం రూ.24 వేలు బాకీ పడింది. మరోవైపు ఈ రెండేళ్లలో 162 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. కాంగ్రెసోడు ఊరికే ఇవ్వడు. గల్లా పట్టి అడిగితేనే ఇస్తాడు.. అందుకే పోరాటం తప్పదు..’అని కేటీఆర్ అన్నారు. జిల్లాలోని అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతిలోపు తాము ప్రమాద బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్లు ఒక క్రెడిట్ సొసైటీ (కోఆపరేటివ్)గా ఏర్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొండూరి రవీందర్రావు, తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, మాజీ జెడ్పీ చైర్పర్సన్లు తులా ఉమ, అరుణ, ఆటోకార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
జైలులో బీడీలు, గుట్కా ఇవ్వాలని ఖైదీల డిమాండు
దొడ్డబళ్లాపురం: బీడీలు, గుట్కా ఇవ్వాలని డిమాండు చేస్తూ కలబుర్గి జైలులో ఖైదీలు ధర్నా చేశారు. ఇటీవల జైలులో అన్నీ నిలిపివేసారని ముస్తఫా అనే ఖైదీ ఆధ్వర్యంలో సుమారు 70 మంది ధర్నా చేసినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన జైలు అధికారి అనిత లంచం అడిగారని ముస్తఫా ఒక మహిళ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు ఇప్పించాడు. డబ్బులు ఇస్తేనే పొగాకు, గుట్కాలను అనుమతిస్తానని ఆమె స్పష్టం చేసిందన్నారు. అతడు, మిగతా ఖైదీలు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని జైలర్ అనిత సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు సోదరితో మాట్లాడిన ఆడియోలో తనకు బెదిరింపులు ఉన్నాయని అనిత చెబుతున్నారు. గుట్కా తదితరాలను అడ్డుకోవడంతో తనపై కక్ష గట్టారని ఆమె చెప్పారు. -
ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
సుల్తాన్ బజార్: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కోఠిలోని డీఎంహెచ్ఎస్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా ఆశవర్కర్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ తామంతా సుశిక్షితులమని, ఎప్పటి కప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజాసేవ చేస్తున్నామని చెప్పారు. రోగుల సర్వే చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్, అన్ని రకాల జబ్బులు గుర్తించి మందులను రోగులకు సరఫరా చేస్తున్నామన్నారు. కరోనా నియంత్రించడంలో ఆశావర్కర్లు కీలక పాత్ర పోషించారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశావర్కర్లకు హెల్త్ గ్లోబల్ లీడర్స్ అవార్డును కూడా ప్రకటించిందని గుర్తు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సబ్ సెంటర్స్, దవాఖానాల్లో పనిచేయాలని ప్రభుత్వం చెబుతోందని, అయినా తమకు కేవలం రూ.9.750 వేలు మాత్రమే పారితోషకమే ఇస్తోందన్నారు. ఒకవైపు పనిభారంతో, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వేతనం రూ.18 వేలకు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లకు హెల్త్ కార్డులు, ప్రమాద బీమా రూ.5 లక్షలు ఇవ్వాలని, ఏఎన్ఎం, జీఎన్ఎం పోస్టుల్లో ఆశావర్కర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.నీలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్!
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. వేతనాల పెంపు సహా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో వారితో గొడవకు దిగారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పాయి. కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ముందుగా పాటియాలా బైపాస్లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి సంగ్రూర్లోని సీఎం భగవంత్ మాన్ ఇంటి వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయటంతో పలువురికి గాయాలయ్యాయి. #WATCH | Punjab Police lathi-charged Mazdoor Union people who were marching towards CM Bhagwant Mann's residence in Sangrur regarding their various demands pic.twitter.com/MkpxdNSNQf — ANI (@ANI) November 30, 2022 ఇదీ చదవండి: ‘కేజ్రీవాల్ సర్ మీ మఫ్లర్ ఏది?’.. ఢిల్లీ సీఎంకు ఎదురైన వింత ప్రశ్న -
ఆర్భాటంగా వేడుకలు.. జనం మండిపాటు
మటోబో: అదుపులో లేని ద్రవ్యోల్బణం, ఆగని ఆకలి చావుల మధ్య కూడా జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే 93వ జన్మదినం సందర్భంగా భారీ ఖర్చుతో విందు విలాసాలు ఏర్పాటుచేశారు. శనివారం బులావాయో పట్టణం ఆవల తన పార్టీ జాను–పీఎఫ్(జెడ్ఏఎన్యూ–పీఎఫ్) నిర్వహించిన వేడుకకు వేల సంఖ్యలో ఆయన మద్దతుదారులు హాజరయ్యారు. మంగళవారం పుట్టిన రోజు జరుపుకున్న ముగాబే గౌరవార్థం వారంపాటు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ మీడియాలో అయితే ఆయన మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశం తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్న సమయంలో ఇంత హంగూ ఆర్భాటాలతో వేడుకలు జరపడం ప్రజలను, ప్రతిపక్షాలను ఆగ్రహానికి గురిచేసింది. వచ్చిన అతిథుల కడుపు నింపడానికి స్థానిక ప్రజలు తమ పశువులు అమ్ముకోవడం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. 1980 నుంచి నిరాటకంగా కొనసాగుతున్న ముగాబే పాలనాకాలంలో అసమ్మతి అణచివేత, ఓట్ల రిగ్గింగ్, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం లాంటి మచ్చలెన్నో ఉన్నాయి. ఎదురుతిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన దాఖలాలు కోకొల్లలు. ఉత్తరకొరియా శిక్షణలో రాటుదేలిన జింబాబ్వే బలగాల చేతుల్లో సుమారు 20 వేల మంది చనిపోయారని ఓ అంచనా. వయసు మీద పడుతున్నా గద్దె దిగేదిలేదని ఓ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముగాబే స్పష్టం చేశారు. ఆయన కళ్లు మూతలుపడుతుండగా, మాటకు మాటకు మధ్య విరామం వల్ల స్వరం తడబాటుతో ఆ ఇంటర్వ్యూ సాగింది. తన పార్టీ కోరితేనే పదవి నుంచి తప్పుకుంటానని ముగాబే చెప్పారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలకు పార్టీ ముగాబేనే తన అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. -
మెరీనా బీచ్లో భారీ ఆంధోళన
-
రుణమాఫీపైనారీ భేరి
జిల్లా వ్యాప్తంగా మహిళల ఆందోళనలు ఎంపీడీఓ కార్యాలయాల ముట్టడి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా మహిళలు పోరుబాట పట్టారు. ఐద్వా ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయాలు ముట్టడించారు. మాఫీ చేసిన వెంటనే తిరిగి సబ్సిడీపై రుణాలివ్వాలని నినదించారు. దేవరాపల్లి: డ్వాక్రా రుణాల పూర్తి మాఫీ కోరుతూ మహిళలు కదం తొక్కారు. రుణమాఫీని అన్ని గ్రూపులకూ వర్తింపజేయాలని, అప్పు తీర్చిన వారికి సబ్సిడీ రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో రైవాడ అతిథిగృహం నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని ముట్టడించారు. అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని స్తంభింపజేశారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ హామీని ఎప్పుడు అమలు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. రెండు గంటల పాటు కార్యాలయాన్ని ముట్టడించడంతో ఎస్ఐ వి. లక్ష్మణరావు సిబ్బందితో వచ్చి ఆందోళన విరమించడానికి ప్రయత్నించారు. మహిళలు పోలీసులపై తిరుగుబడడంతో వెనుదిరిగారు. అధికారులు, బ్యాంకు అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని ప్రజావాణి సమావేశ మంది రంలో బైఠాయించారు. దీంతో వివిధ బ్యాంకుల అధికారులు వచ్చి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రుణాలను మాఫీ చేస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు. అనంతరం ఎంపీడీఓ ఆర్.పూర్ణిమాదేవి, తహశీల్దార్ వై.ఎస్.వి.వి.ప్రసాదరావులకు వినతిపత్రాలిచ్చారు. అంతకుముందు రైవాడ అతిథిగృహం వద్ద జరిగిన సమావేశంలో డ్వాక్రా రుణమాఫీ జరిగే వరకు పోరాటం సాగిద్దామని ప్రతిన పూనారు. వీరికి సీఐటీయూ, ఐకెపీ యానిమేటర్లు, ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.


