మావోయిస్టు టి.ఇన్చార్జిగా మల్లోజుల వేణుగోపాల్!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్చార్జిగా అగ్రనాయకుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సాధును నియమించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం వేణుగోపాల్ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జిగా ఉన్నాడు. ఈయన మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు. రాష్ట్ర విభజన ఖరారైపోవడంతో.. తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ అధికార ప్రతినిధి కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కరీంనగర్కు చెందిన వేణుగోపాల్ను తెలంగాణ రాష్ట్ర కమిటీకి కేంద్ర కమిటీ తరఫున బాధ్యునిగా నియమించినట్లు సమాచారం. అలాగే, గతంలో తమకు పెట్టని కోటలా ఉన్న ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తిరిగి పట్టు సాధించే లక్ష్యాన్ని ఆయనకు నిర్దేశించినట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల నుంచి మేధావి వర్గాన్ని పార్టీ వైపు ఆకర్షించే బాధ్యతలను ఆయనపై ఉంచినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.