breaking news
International Shooting Sport Federation
-
వరల్డ్ కప్ ఫైనల్కు మను, సురుచి, ఇషా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్కప్ ఫైనల్కు భారత్ నుంచి 8 మంది షూటర్లు అర్హత సాధించారు. ఈ ఏడాది డిసెంబర్ 4 నుంచి 9 వరకు ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మన దేశం నుంచి పారిస్ ఒలింపిక్స్ పతక విజేత మనూ భాకర్తో పాటు మరో ఏడుగురు షూటర్లు బరిలోకి దిగనున్నారు. 12 వ్యక్తిగత ఒలింపిక్ ఈవెంట్లలో ఈ ఏడాది అత్యుత్తమ షూటర్ను నిర్ణయించేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. వీటిలో ఐదింట భారత షూటర్లు పోటీపడుతున్నారు. స్టార్ షూటర్ మనూ భాకర్ రెండు విభాగాల్లో వరల్డ్కప్ ఫైనల్కు ఎంపికైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్తో పాటు, 25 మీటర్ల విభాగంలో మను పోటీపడనుంది. ఇక ఈ సీజన్లో చక్కటి గురితో మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న టీనేజర్ సురుచి సింగ్ కూడా భారత్ నుంచి బరిలోకి దిగనుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో బ్యూనస్ ఎయిర్స్, లిమా, మ్యూనిక్లలో సురుచి పసిడి పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల నింగ్బో ప్రపంచకప్లో స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ సైతం ఈ టోర్నీలో పాల్గొననుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఇషా పోటీపడనుంది. ప్రపంచ మాజీ చాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబూతా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగానికి ఎంపికయ్యారు. రుద్రాంక్ష్ బ్యూనస్ ఎయిర్స్ వరల్డ్కప్లో స్వర్ణంతో మెరవగా... ఒలింపియన్ అర్జున్ లిమా ప్రపంచకప్లో రజతం గెలుచుకున్నాడు. ఆసియా చాంపియన్, ప్రపంచ రికార్డు హోల్డర్ సిఫ్ట్ కౌర్ సమ్రా... మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో, ఒలింపియన్ విజయ్వీర్ సిద్ధూ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో పోటీ పడనున్నారు. సిఫ్ట్ కౌర్ సమ్రా బ్యూనస్ ఎయిర్స్ ప్రపంచకప్లో స్వర్ణం గెలవగా... అదే పోటీలో విజయ్వీర్ పసిడి నెగ్గాడు.మహిళల 25 మీటర్ల విభాగంలో సిమ్రన్ప్రీత్ కౌర్ బ్రార్ కూడా వరల్డ్కప్ ఫైనల్ అవకాశం దక్కించుకుంది. లిమా ప్రపంచకప్లో రజతం నెగ్గడం ద్వారా సిమ్రన్కు ఈ చాన్స్ దక్కింది. వరల్డ్కప్ ఫైనల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి వరుసగా 5000 యూరోలు (రూ. 5 లక్షల 20 వేలు), 4000 యూరోలు (రూ. 4 లక్షల 16 వేలు), 2000 యూరోలు (రూ. 2 లక్షల 8 వేలు) ప్రైజ్మనీగా లభిస్తాయి. ఈ ఏడాది జరిగిన నాలుగు వరల్డ్కప్ వేర్వేరు విభాగాల్లో కలిసి భారత షూటర్లు 22 పతకాలు సాధించింది. అందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. -
భారత షూటర్లకు మళ్లీ నిరాశే
నింగ్బో (చైనా): భారత షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా క్వాలిఫికేషన్ రౌండ్లలోనే గురి కుదరక పతకం బరికి దూరమవుతున్నారు. చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్లో గురువారం జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమా మహేశ్ సహా దివ్యాన్‡్ష, రాహీ సర్నోబత్లు క్వాలిఫయింగ్లోనే వెనుదిరిగారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్లో దివ్యాన్‡్ష 630 స్కోరుతో 19వ స్థానంలో నిలిచాడు. ఉమామహేశ్ 627.7 పాయింట్లు స్కోరు చేసి 39 స్థానంలో, మరో భారత మరో షూటర్ నీరజ్ కుమార్ (626.1) 54వ స్థానంలో నిలిచారు. మహిళల ర్యాపిడ్ ఫైర్ క్వాలిఫికేషన్లో అభిజ్ఞ అశోక్ పాటిల్ 583 స్కోరుతో 11వ స్థానంలో నిలిచింది. టీఎస్ దివ్య (581), ఒలింపియన్, ఆసియా క్రీడల చాంపియన్ రాహీ సర్నోబత్ (581)లు వరుసగా 16, 17 స్థానాలు పొందారు. ఇప్పుడిక భారత్ ఆశలన్నీ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్పైనే ఉన్నాయి. మెహులీ ఘోష్, తెలంగాణ అమ్మాయి సురభి రాపోలు, మానిని కౌశిక్లు బరిలో ఉన్నారు. -
కైనన్, గగన్, రష్మీలకు చోటు
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీకి భారత జట్టు ఎంపిక న్యూఢిల్లీ: తొలిసారి భారత్ ఆతిథ్యమివ్వనున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇటీవలే పుణేలో జరిగిన జాతీయ సీనియర్ చాంపియన్షిప్ పోటీలతోపాటు రెండు సెలెక్షన్ టోర్నీలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ జట్టు ఎంపిక జరిగింది. రియో ఒలింపిక్స్లో పాల్గొన్న తెలంగాణ షూటర్లు గగన్ నారంగ్ (రైఫిల్ ప్రోన్), కైనన్ షెనాయ్ (ట్రాప్)లతోపాటు మహిళల స్కీట్ ఈవెంట్లో జాతీయ చాంపియన్ రష్మీ రాథోడ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 3 వరకు న్యూఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. -
జూనియర్ షూటర్లకు 9 పతకాలు
న్యూఢిల్లీ : చెక్ రిపబ్లిక్లో జరిగిన షూటింగ్ హోప్స్ కాంపిటీషన్లో 24 మందితో కూడిన భారత జూనియర్ జట్టు మెరుగైన ప్రదర్శన చూపింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 14 వరకు జరిగిన ఈ టోర్నీలో జట్టుకు రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్యాలు దక్కాయి. వ్యక్తిగత విభాగంలో అచల్ ప్రతాప్ గ్రేవాల్ (25మీ. పిస్టల్) స్వర్ణం సాధించాడు. -
మానవ్జిత్ పసిడి ‘గురి’
ప్రపంచకప్ ‘ట్రాప్’ షూటింగ్లో అగ్రస్థానం ఫైనల్లో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్పై గెలుపు న్యూఢిల్లీ: తనలో ఇంకా చేవ తగ్గలేదని... పట్టుసడలని ఏకాగ్రత... లక్ష్యంపై గురి ఉంటే పతకాలు వాటంతట అవే వస్తాయని భారత స్టార్ ‘ట్రాప్’ షూటర్ మానవ్జిత్ సింగ్ సంధూ మరోసారి నిరూపించాడు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) షాట్గన్ ప్రపంచకప్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన 37 ఏళ్ల ఈ పంజాబ్ షూటర్ ఏకంగా స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. అమెరికాలోని టక్సన్లో భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ‘ట్రాప్’ ఈవెంట్ ఫైనల్లో 2006 వరల్డ్ చాంపియన్ మానవ్జిత్ 13-9 పాయింట్లతో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ మైకేల్ డైమండ్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఇద్దరికీ 15 చొప్పున టార్గెట్లు ఇచ్చారు. మానవ్జిత్ 13 సార్లు లక్ష్యాన్ని ఛేదించగా... 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్లో స్వర్ణాలు నెగ్గిన మైకేల్ డైమండ్ 9 సార్లు మాత్రమే సఫలమయ్యాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్లో డైమండ్ 15 పాయింట్లు సాధించగా... మానవ్జిత్, అలెక్సీ అలిపోవ్ (రష్యా), ఆరన్ హెడింగ్ (బ్రిటన్) 14 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. ‘షూట్ ఆఫ్’లో మానవ్జిత్ 6 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. కాంస్య పతక పోటీలో అలిపోవ్ 12-10తో హెడింగ్ను ఓడించాడు. క్వాలిఫయింగ్లో మానవ్జిత్ 121 పాయింట్లు స్కోరు చేసి సెమీఫైనల్కు అర్హత పొందాడు. నాలుగేళ్ల విరామం తర్వాత మానవ్జిత్ ప్రపంచకప్లో పసిడి పతకాన్ని నెగ్గడం విశేషం. చివరిసారి అతను 2010లో మెక్సికోలో జరిగిన ప్రపంచకప్లో ఈ ఘనత సాధించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్ (2004 ఏథెన్స్, 2008 బీజింగ్, 2012 లండన్) క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన మానవ్జిత్ మూడుసార్లూ క్వాలిఫయింగ్లోనే వెనుదిరిగాడు. ఈ మెగా ఈవెంట్ కోసం గత శీతాకాలం మొత్తం సాధన చేశాను. ఫైనల్లో ప్రపంచ మేటి షూటర్లు బరిలోకి దిగారు. ముఖ్యంగా మైకేల్ డైమండ్తో ఫైనల్ పోటీ సవాల్తో కూడుకున్నది. అయితే మన లక్ష్యాన్ని మనమే గురి చూసి కొట్టాలి కదా. ఫైనల్ స్కోరు ఈ విషయాన్ని చెబుతోంది. ఈ ఏడాది భారత షూటర్లకు ఎంతో కీలకం. జూలైలో కామన్వెల్త్ గేమ్స్, సెప్టెంబరులోనే ప్రపంచ చాంపియన్షిప్, ఆసియా క్రీడలు ఉన్నాయి. ప్రపంచ చాంపియన్షిప్ ద్వారా 2016 ఒలింపిక్స్కు 64 మంది షూటర్లు అర్హత సాధించే అవకాశముంది. - మానవ్జిత్