breaking news
india olympic Association
-
చైనా ‘ఆట’లు ఆపతరమా..!
ఐపీఎల్తో చైనా కంపెనీ ‘వివో’ ఒప్పందాన్ని సమీక్షిస్తామంటూ బీసీసీఐ ప్రత్యేక సమావేశానికి సిద్ధమైంది. ఆ స్పాన్సర్షిప్ విలువ అక్షరాలా రూ. 2,199 కోట్లు!... అవసరమైతే మేం కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తాం అంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కూడా చెబుతోంది. వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య అయితే ఇప్పటికే చైనా ఎక్విప్మెంట్ను పక్కన పెట్టేసినట్లు ప్రకటించేసింది. సరిహద్దు వివాదం నేపథ్యంలో సహజంగానే మన క్రీడా సంఘాల్లో తమ వైపునుంచి దేశభక్తిని ప్రదర్శించేందుకు ఒకరితో మరొకరు పోటీ పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంనుంచి అధికారికంగా నిషేధం లేకుండా ఇలాంటివి అసలు సాధ్యమేనా... భారత క్రీడా రంగానికి గత కొన్నేళ్లలో చైనాతో ముడిపడిపోయిన బంధాన్ని చూస్తే ‘బాయ్కాట్’కు సాహసించడం అంత సులువు కాదు. కేంద్ర వాణిజ్య శాఖ ఎగుమతులు, దిగుమతుల డేటా బ్యాంక్ ప్రకారం 2019 ఏప్రిల్నుంచి 2020 ఫిబ్రవరి వరకు భారతదేశంలో ‘జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్, ఇతర అవుట్డోర్ క్రీడలు సహా’ సుమారు రూ. 919 కోట్ల క్రీడా పరికరాలు చైనానుంచి దిగుమతి అయ్యాయి. మొత్తంగా ఆ సమయంలో మనం తెప్పించుకున్న క్రీడా సామగ్రిలో 65 శాతం చైనానుంచే వచ్చింది. ఇంకా చెప్పాలంటే గత ఐదేళ్లలో భారత స్పోర్ట్స్ మార్కెట్లోకి చైనా దిగుమతుల విలువ ఏకంగా 80 శాతం పెరిగింది. ముఖ్యంగా బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫిట్నెస్ ఎక్విప్మెంట్లలో సింహభాగం చైనాదే. ఇటీవల బాస్కెట్బాల్, ఫుట్బాల్ కూడా ఆ దేశంనుంచే వస్తున్నాయి. ముడి సరుకు మాత్రమే కాకుండా పూర్తయిన క్రీడా సామగ్రి కూడా చైనాదే. ప్రస్తుతం భారత క్రీడల్లో చైనా వస్తువుల ఆధిపత్యం ఏమిటో ఇది చూపిస్తోంది. పుణేకు చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ దీనిపై మాట్లాడుతూ ...‘చైనాకు చెందిన తైషన్ అనే కంపెనీనుంచి మన దేశానికి జిమ్నాస్టిక్స్ ఎక్విప్మెంట్ వస్తుంది. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య గుర్తించిన ప్రమాణాలను పాటిస్తూ రూ. 1 కోటికి అది ఒక సెట్ను అందిస్తుంది. అదే జర్మనీనో, ఫ్రెంచో అయితే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. దానిని ఎవరు భరిస్తారు’ అనడం వాస్తవ స్థితికి అద్దం పడుతోంది. లీ–నింగ్ జోరు... భారత్కు సంబంధించి క్రికెటేతర క్రీడల్లో ఇప్పుడు చైనాకు చెందిన లీ–నింగ్దే హవా. మాజీ జిమ్నాస్ట్, 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో 6 పతకాలు సాధించిన ఆ దేశపు దిగ్గజం లీ–నింగ్కు చెందిన ఈ కంపెనీ ఒక్కసారిగా దూసుకొచ్చింది. సొంత దేశం తర్వాత వారికి అది పెద్ద మార్కెట్ భారత్లో ఉంది. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు పీవీ సింధుతో నాలుగేళ్లకు రూ. 48 కోట్లు, కిడాంబి శ్రీకాంత్తో రూ. 35 కోట్ల ఒప్పందాలు చేసుకోవడంతో పాటు ఇతర యువ షట్లర్లను కూడా లీ–నింగ్తో తమతో చేర్చుకుంది. భారత బ్యాడ్మింటన్పై తమ పైచేయి సాధించేందుకు సిద్ధమైంది. ఇదే క్రమంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాదికి వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ వరకు అది అమల్లో ఉంటుంది. ప్రపంచపు అతి పెద్ద మెగా ఈవెంట్లో భారత అథ్లెట్లంతా లీ–నింగ్ లోగో ముద్రించిన దుస్తులతోనే పోటీ పడాల్సి ఉంటుంది. మేం కూడా సమీక్షిస్తాŠం అంటూ బయటకు చెబుతున్నా అది సాధ్యం కాదనేది వారికీ తెలుసు. ‘క్రికెటేతర క్రీడలకు స్పాన్సర్లు దొరకడం చాలా కష్టం. లీ–నింగ్ ఎక్కువ మొత్తానికి బిడ్ వేయడంతో వారితో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రభుత్వం కచ్చితమైన మార్గనిర్దేశకాలు జారీ చేస్తే ఏమో గానీ ఒలింపిక్స్కు ముందు వారితో ఒప్పందం రద్దు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ అలా చేస్తే ఒప్పంద ఉల్లంఘన కింద ఇవ్వాల్సిన నష్టపరిహారం తట్టుకోలేనంతగా ఉంటుంది’ అని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా కుండ బద్దలు కొట్టారు. అడుగడుగునా చైనా యువాన్లే... మొబైల్స్ ఉత్పత్తుల చైనా కంపెనీ ‘వివో’ ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. ఏడాదికి రూ. 440 కోట్ల భారీ ఒప్పందంలో బీసీసీఐపై కనకవర్షం కురిసింది. అది అంతకు ముందుకంటే 554 శాతం ఎక్కువ! ప్రొ కబడ్డీ లీగ్కు కూడా రూ. 300 కోట్ల విలువతో (ఐదేళ్లకు) వివోనే స్పాన్సర్. 2017లో టీమిండియా ప్రధాన స్పాన్సర్షిప్ కోసం మరో చైనా కంపెనీ ‘ఒప్పో’ రూ. 1079 కోట్లు చెల్లించింది. ఒప్పో అనూహ్యంగా తప్పుకున్న తర్వాత ఆన్లైన్ లెర్నింగ్ కంపెనీ ‘బైజూస్’ ఇప్పుడు కోహ్లి సేనకు ప్రధాన స్పాన్సర్గా ఉంది. బైజూస్లో కూడా చైనా కంపెనీ ‘టెన్సెంట్’ పెట్టుబడులు ఉన్నాయి. బీసీసీఐతో స్పాన్సర్లుగా అనుబంధం కొనసాగిస్తున్నవాటిలో చైనాతో సంబంధం, నేపథ్యం ఉన్న పేటీఎం, డ్రీమ్ 11, స్విగ్గీ, మేక్ మై ట్రిప్...ఇలా ఈ జాబితా పెద్దదే. ఇలాంటి స్థితిలో భారత కంపెనీలు ముందుకొచ్చి క్రీడా సంఘాలు ఆశించిన మొత్తానికి కోట్లాది రూపాయల స్పాన్సర్షిప్ ఇవ్వడం దాదాపుగా అసాధ్యం. ‘ఎక్కడో ఒక చోట పెట్టక తప్పదు కాబట్టి ఆయా సంస్థల నేపథ్యం ఏ దేశందైనా ఉండవచ్చు. కానీ ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీలు. వాటికి జాతీయత ఆపాదించడం సరైంది కాదు’ అంటూ ప్రముఖ స్పోర్ట్స్ లాయర్ నందన్ కామన్ చేసిన వ్యాఖ్యను చూస్తే తాజా పరిస్థితుల్లో చైనా లేకుండా మన ఆటలు కష్టమేమో! -
ఐఓసీలో రణ్ధీర్కు గౌరవ సభ్యత్వం
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాజీ ప్రధాన కార్యదర్శి రణ్ధీర్ సింగ్కు అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ)లో గౌరవ సభ్యత్వం లభించింది. అశ్వినీ కుమార్ తర్వాత ఈ అవకాశం లభించిన రెండో వ్యక్తి రణ్ధీర్ కావడం విశేషం. 13 ఏళ్ల పాటు ఐఓసీలో పూర్తి స్థాయి సభ్యుడిగా పని చేసిన రణ్ధీర్ను గౌరవిస్తూ మొనాకోలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రణ్ధీర్ కూడా పాల్గొన్నారు. ఐఓఏ తరఫున అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ దీనికి హాజరయ్యారు. -
సరితకు ‘ఏషియాడ్’ పతకం అందజేత
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో తాను నెగ్గిన కాంస్య పతకాన్ని భారత మహిళా బాక్సర్ సరితా దేవి బుధవారం స్వీకరించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ఈ పతకాన్ని ఆమెకు అందజేశారు. కొరియా బాక్సర్తో జరిగిన వివాదాస్పద 60 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓటమి తర్వాత... బహుమతి ప్రదానోత్సవంలో పతకాన్ని స్వీకరించేందుకు సరితా దేవి నిరాకరించింది. దీంతో ఆమెను ఏఐబీఏ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. -
క్రీడల నుంచి వైదొలిగితే జరిమానా
ఐఓఏను హెచ్చరించిన ఓసీఏ న్యూఢిల్లీ: ఆసియా క్రీడలకు కొన్ని జట్లను పంపకూడదని నిర్ణయించిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 29న ఈమేరకు ఐఓఏకు ఈమెయిల్ పంపింది. ‘ఫుట్బాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, టేబుల్ టెన్నిస్, సెపక్ తక్రా టీమ్స్ను ఆసియాడ్కు పంపకూడదని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అన్ని క్రీడల డ్రా ఇప్పటికే పూర్తయ్యింది. ఒకవేళ ఐఓఏ ఉపసంహరణకే మొగ్గు చూపితే కచ్చితంగా పెనాల్టీ ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే మేం తిరిగి కొత్తగా డ్రా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది’ అని ఓసీఏ తెలిపింది. మరోవైపు క్రీడా శాఖ, సాయ్ అధికారుల నిర్వాకం వల్లే భారత్లో క్రీడలు నాశనమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఐఓఏ ప్రధాన కార్యదర్శి నరీందర్ బాత్రా ఆరోపించారు. -
‘బాక్సింగ్’ బాధ్యతలపై ఐఓఏ ఆశ్చర్యం
తమకు సమాచారమే లేదని వెల్లడి న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ బాధ్యతల్ని స్పాన్సర్లకు అప్పగిస్తూ అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) తీసుకున్న నిర్ణయంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తమను సంప్రదించకుండా, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించింది. బాక్సింగ్కు కొత్త సమాఖ్య ఏర్పడేదాకా నిర్వహణ బాధ్యతల్ని బాక్సింగ్ ఇండియా పేరిట ఏర్పడిన స్పాన్సర్ల గ్రూపునకు ఏఐబీఏ అప్పగించిన విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) నిబంధనల ప్రకారం.. ఏ గ్రూపునైనా ఆమోదించేముందు ఏఐబీఏ తప్పనిసరిగా జాతీయ ఒలిం పిక్ కమిటీని సంప్రదించాల్సివుంటుందని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపారు. తమకుగానీ, తమ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్కుగానీ ఈ విషయంలో ఎటువంటి సమాచారం లేదని ఆయన వెల్లడించారు. ‘ఏ జాతీయ క్రీడా సమాఖ్యకైనా ఐఓఏ గుర్తింపు తప్పనిసరి. అథ్లెట్లు ఎవరైనా అంతర్జాతీయ పోటీలకు ఐఓఏ తరఫునే వెళ్లాలి. ఏఐబీఏ తీరు ఐఓసీ నిబంధనలకు విరుద్ధం’ అని మెహతా అన్నారు. కొద్ది రోజుల్లో ఐఓఏ సీనియర్ సభ్యులంతా ఢిల్లీలో సమావేశమై ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.