-
ట్రిపుల్ వన్ (111) జీవో రద్దు: గండిపేట రహస్యం!
హైదరాబాద్ నగర చల్లదనం ఓ పాతతరం జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఈ నగరం వేసవి విడిదిగా ఉండేదని చెబితే ఈ తరం వాళ్లు నమ్మకపోవచ్చు. పైగా నవ్వుకోవచ్చు. గండిపేట నీళ్ల తీయదనం కూడా మన కళ్ల ముందే జ్ఞాపకాల్లోకి జారిపోతున్నది. నగరానికి పడమటి దిక్కున ఆనుకొని ఉన్న 84 గ్రామాలను వెనుకబాటుతనం నుంచి ‘విముక్తం’ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరం వేగంగా విస్తరిస్తూ శివారు పల్లెలనూ, పచ్చదనాలనూ ఆక్రమిస్తూ సాగుతున్నది. ఈ పరిణామంతో భూముల ధరలు పెరగడం వల్ల శివారు రైతులకూ అంతో ఇంతో ఆర్థిక లబ్ధి కలుగుతున్నది. నగరంలోని ఖరీదైన, పురోగామి పథంలో ఉన్న ప్రదేశాలకు ఈ 84 గ్రామాలు అతి చేరువలో ఉంటాయి. పాతికేళ్ల కిందట అమల్లోకి వచ్చిన ట్రిపుల్ వన్ (111) జీవో ఆంక్షలు ఈ ప్రాంత వాసులకు శాపంగా మారాయని ప్రభుత్వం భావిస్తున్నది. అక్కడ భూములున్నవారిది కూడా అదే అభిప్రాయం. కొందరు ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్ బాబులు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నారు. మరెందుకింక ఆలస్యం? ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు, అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం జీవోను ఉపసంహరించుకుంటున్నట్టు మొన్నటి కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నది. అనంతగిరుల్లో పుట్టిన మూసీ, దాని ఉపనది ఈసీల మీద ఆనకట్టలు కట్టి ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్ జంట జలాశయాలను సుమారు వందేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరానికి ఆధునిక వన్నెలు తొడిగి ప్రపంచపటంలో సగర్వంగా నిలబెట్టిన నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఖాతాలోదే ఈ జంట జలాశయాల ఘనత కూడా! మూసీ వరదల నుంచి హైదరాబాద్ను రక్షించడం, నగరవాసుల దాహార్తిని తీర్చడం అనే రెండు లక్ష్యాల సాధన కోసం సర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు ఈ రెండు చెరువులను తవ్వించారు. సుమారు యాభయ్యేళ్లపాటు ఈ జంట జలాశ యాలే పూర్తిగా సిటీ అవసరాలను తీర్చాయి. విస్తరణ వేగం పెరగడంతో క్రమంగా మంజీర, కృష్ణా జలాలు వచ్చి చేరాయి. ఇప్పుడు గోదావరి నీళ్లు కూడా వస్తున్నాయి. కోటి దాటిన నగర జనాభా అవసరాలను తీర్చడంలో ఈ జలాశయాల వాటా ప్రస్తుతం 15 శాతమే. అయినా గండిపేట గండిపేటే! గండిపేట నీళ్లు ఏ ప్రాంతానికి సరఫరా అవుతాయంటూ ఇప్పటికీ ఆరా తీసేవాళ్లు కనిపిస్తూనే ఉంటారు. నగర నీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తు న్నాము కనుక జంట జలాశయాల మీద ఆధారపడే అవసరం లేదనీ, కావాలంటే వాటిని కూడా గోదావరి జలాలతో నింపు తామని ప్రభుత్వం చెబుతున్నది. వందేళ్ల క్రితం నదీ ప్రవాహాల మీద నిర్మించిన తటాకాలు, ఇన్నేళ్లుగా ఆ తటాకాల చుట్టూ అల్లుకున్న ఎకోసిస్టమ్, ఏర్పడిన పరీవాహక ప్రాంతం ఆ ప్రాంత మంతటా భూగర్భ నీటి ఊటలు... ఇటువంటి వ్యవస్థకు పైపుల ద్వారా లేదా కాల్వల ద్వారా నీటిని తరలించి నింపే రిజర్వాయర్లు సరైన ప్రత్యామ్నాయమేనా? సరే, ‘విస్తృత’ ప్రజాప్రయో జనాల కోసం పర్యావరణంతో రాజీ పడటం, బడుగుల జీవితాలను బలిచేయడం నేర్చుకున్నాము కనుక ఈ ప్రత్యామ్నా యాలతో కూడా రాజీ పడవచ్చు. నిజంగా విస్తృత ప్రజా ప్రయోజనాలున్నాయా? అన్నదే ప్రశ్న. జీవో రద్దుతో ఎవరికి మేలు? ఎవరికి నష్టం? చర్చించవలసి ఉన్నది. గచ్చిబౌలికి కూతవేటు దూరంలో ఉండే మొయినాబాద్ మండలంలోని సాగుయోగ్యమైన భూమిలో ఇప్పుడు స్థానిక రైతుల చేతిలో 20 శాతం భూమి మాత్రమే ఉన్నది. పలు రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ సంస్థలకు వందల ఎకరాల్లో భూములు న్నాయి. కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఐఏఎస్ – ఐపీఎస్ అధికారులకు, సినీనటులకు పది నుంచి పాతికెకరాల వరకు భూములున్నాయి. శంషాబాద్ మండలంలోనూ అదే కథ. ఎనభై శాతానికి పైగా పరాధీనమైంది. తొందరపడి ఎకరా రెండెకరాలను పప్పుబెల్లాలకు అమ్ముకున్న చిన్న రైతులందరూ ఇప్పుడు దినసరి కూలీల అవతారమెత్తారు. జీవో రద్దయిన సంగతి తెలుసుకుని తమ వారసత్వ భూముల దగ్గరకెళ్లి దీనంగా చూస్తున్నారు. తాము ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటయినందుకు మౌనంగా రోదిస్తున్నారు. షాబాద్ మండలంలో రెండే గ్రామాలు జీవో పరిధిలో ఉన్నాయి. ఇందులో 40 శాతం మాత్రమే స్థానిక రైతుల చేతిలో ఉన్నది. చేవెళ్ల మండలంలో జీవో పరిధిలోకి వచ్చే తొమ్మిది గ్రామాల్లో 70 శాతం భూమి పరాధీనమైంది. అంతో ఇంతో స్థోమత గల రైతులు మాత్రమే భూముల్ని నిలబెట్టుకోగలిగారు. చిన్న రైతులందరూ అవసరాల కోసం, ప్రలోభాలకు లోనై అమ్మే సుకున్నాను. శంకర్పల్లి మండలంలో జీవో పరిధిలోని ఏడు గ్రామాల్లో రైతుల దగ్గర మిగిలింది 15 శాతం భూమి మాత్రమే! ఎకరాకు పది లక్షల నుంచి కోటి రూపాయల దాకా వెచ్చించి బడాబాబులు భూములు కొనుగోలు చేశారు. అజీజ్నగర్ వంటి సమీప ప్రాంతాల్లో కొంత ఎక్కువ పెట్టి ఉండవచ్చు. జీవో ఎత్తివేత ఖాయమని తెలిసి ఈ ఏడాదిలోపు కొనుగోలు చేసిన వారు మరికొంత ఎక్కువ వెలకట్టి ఉండవచ్చు. జీవో ఎత్తివేసిన ప్రకటన తర్వాత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే బడాబాబులకు సగటున ఎకరాకు ఐదు కోట్ల లాభం చేకూరినట్టు అంచనా వేస్తున్నారు. సుమారు 70 వేల ఎకరాలు బడాబాబుల చేతుల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ లెక్కన వారికి ఎంత ప్రయోజనం చేకూరిందో ఎవరి లెక్కలు వారు వేసు కోవచ్చు. అక్కడ మౌలిక వసతులు విస్తరించి, నగరం పెరుగు తున్నకొద్దీ బడాబాబుల భూములు బంగారు గనులవుతాయ నడంలో ఆశ్చర్యమేముంటుంది? భూములు రైతుల చేతుల్లో ఉన్నప్పుడు ఆంక్షల సంకెళ్లలో బంధించి, బడాబాబుల చేతుల్లోకి 80 శాతం బదిలీ అవగానే ‘విముక్తి’ చేయడంలోని మతలబు ఏమిటో తేలవలసి ఉన్నది. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం లక్షలాది ఎకరాల సాగు భూమినీ, ఇళ్లనూ, వాకిళ్లను సమర్పించుకొని నిర్వాసితులైన వేలాది కుటుంబాల మీద ఎన్నడూ కురవని సానుభూతి వాన జల్లు ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని నయా ‘భూ’పతుల మీద కురవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ‘విస్తృత ప్రజా ప్రయోజనాల’ రీత్యా తీసుకున్న జీవో రద్దు నిర్ణయానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఏమిటి? రాబోయే తరాల భవిష్యత్తని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం సంకల్పించింది. నగర జీవనం నందనవనంగా మారితేనే అది సాధ్యమౌతుంది. ఇరవై శాతం నీటి వనరులు, మరో ఇరవై శాతం హరితహారం ఉంటేనే అది నందనోద్యానంగా విలసిల్లుతుంది. ఒకప్పుడు హైదరాబాద్కు ఆ ఘనత ఉన్నది. వందలాది చెరువులు కాలనీలుగా మారిపోయాయి. తోటలు పేటలుగా మారాయి. నగరం కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. ఈ మార్పు ఫలితంగా నగర ఉష్ణోగ్రతలు ఇప్పటికే సగటున రెండు డిగ్రీలు పెరిగాయని వాటర్మ్యాన్ రాజేందర్సింగ్ హెచ్చరి స్తున్నారు. ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తే ఈ జంగిల్ అక్కడ కూడా విస్తరిస్తుందనీ ఉష్ణోగ్రతలు, భూతాపం మరింత పెరిగి విధ్వంసకర పరిణామాలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరివాహక ప్రాంతపు నేలలు స్వభావరీత్యా డైక్ ల్యాటరేట్ కేటగిరీకి చెందినవట. భారీ వర్షాలకు కుంగిపోయే స్వభావం ఈ నేలలకు ఉన్నదంటారు. ఇటువంటి నేలల్లోకి వ్యర్థాలు, కాలుష్యాలు చేరితే అవి త్వరగా వ్యాప్తిచెంది జలాశయాల్లోకి చేరుతాయి. ఈమేరకు శాస్త్రీయంగా అధ్యయనం చేసిన రెండు నిపుణుల కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికల ఆధారంగానే సుప్రీంకోర్టు జీవోను సమర్థించింది. ఇప్పుడు మళ్లీ ఈ సమస్య సుప్రీంకోర్టుకూ, గ్రీన్ ట్రిబ్యునల్కూ వెళితే ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందో చూడాలి. పర్యావరణ సందేహాలకు సమాధానాలు చెబుతూ, విస్తృత ప్రజా ప్రయోజనాలను వివరిస్తూ ఒక వివరణ ఇచ్చిన తర్వాతనే ఇటువంటి కీలకమైన విధాన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అటువంటి వివరణ లేకపోతే జనం మదిలో అదొక గండిపేట రహస్యంగానే మిగిలిపోతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Usman Sagar: విస్తీర్ణానికి ‘గండి’!
సాక్షి, హైదరాబాద్: శతాబ్ద కాలంగా మహానగర దాహార్తిని తీరుస్తున్న గండిపేట (ఉస్మాన్సాగర్) విస్తీర్ణం తగ్గిందా? అంటే.. అవుననే అంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ జలాశయ విస్తీర్ణంపై హెచ్ఎండీఏ జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్, జలమండలి నుంచి గతంలో సేకరించిన మ్యాప్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. వీటి ప్రకారం చూస్తే జలాశయ విస్తీర్ణం (ఎఫ్టీఎల్ పరిధి) సుమారు 300 ఎకరాల మేర తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యత్యాసంపై వ్యాజ్యం ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిపై 2019లో హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలు సర్వే నిర్వహించి ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్ విడుదల చేశాయి. గండిపేట జలాశయం విస్తీర్ణం 6,039 ఎకరాలని పేర్కొన్నాయి. అయితే పలువురు పర్యావరణవేత్తలు 2014లో సమాచార హక్కు చట్టం కింద జలమండలి నుంచి గండిపేట ఎఫ్టీఎల్కు సంబంధించిన మ్యాపులను సేకరించారు. ఇందులో జలాశయం విస్తీర్ణం 6,335.35 ఎకరాలుగా ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు పర్యావరణవేత్తలు రెండు మ్యాప్ల మధ్య తేడాకు కారణాలు ఏమిటన్న అంశంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జలాశయం విస్తీర్ణం తగ్గితే నీటినిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ తీరుపై హైకోర్టు ఆగ్రహం గండిపేట, హిమాయత్సాగర్ జలాశయాల చుట్టూ 10 కి.మీ పరిధిలో ఉన్న 84 గ్రామాల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెక్డ్యామ్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, లేఅవుట్లు చేపట్టకూడదని 1996 మార్చి 8న జారీచేసిన జీవో నంబర్ 111 స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 111 నంబర్ జీవోకు సంబంధించి 2016లో ఏర్పాటు చేసిన కమిటీ పనితీరుపై హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా నివేదిక సమర్పించక పోవడాన్ని తప్పుబట్టింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనల నేపథ్యంలో.. జంట జలాశయాల పరిరక్షణ చర్యలు, 111 జీవోలో మార్పులు చేర్పులను సూచించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారులు ఎస్పీ సింగ్, దానకిశోర్, ఎస్కే జోషీ ఈ కమిటీలో ఉన్నారు. ఆక్రమణలే శాపం ఆరేళ్ల కిందట పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన సర్వేలో జీవో 111లో పేర్కొన్న 84 గ్రామాలకు సంబంధిచిన వేలాది ఎకరాల్లో 418 అక్రమ లే అవుట్లు, 6,682 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. మరో 5,202 వ్యక్తిగత గృహాలు కూడా కలిపి మొత్తం 11,887 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు సర్వే తేల్చింది. జంట జలాశయాలకు ఇన్ఫ్లో రాకుండా పలు లే అవుట్లు, ఇతర నిర్మాణాల చుట్టూ భారీ గోడలు నిర్మించారు. జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో పలువురు ప్రముఖులు ఏర్పాటు చేసిన ఫామ్హౌస్లు కూడా శాపంగా పరిణమించాయి. సమగ్ర విచారణ చేపట్టాలి గతంలో జలమండలి నుంచి మేము సేకరించిన మ్యాపులు.. హెచ్ఎండీఏ జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను పరిశీలిస్తే గండిపేట విస్తీర్ణం 300 ఎకరాలు తగ్గినట్లు కనిపిస్తుంది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్కు మూడుసార్లు లేఖ రాశాం. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి గండిపేటతో పాటు హిమాయత్సాగర్ జలాశయాన్నిక కూడా పరిరక్షించాలి. – లుబ్నా సర్వత్, పర్యావరణవేత్త -
26, 27న నీళ్లు బంద్
గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాలకు ఈ నెల 26, 27 తేదీల్లో గండిపేట నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. మరమ్మతు పనుల కారణంగాఈ చర్య చేపడుతున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. తిరిగి 28న నీటిసరఫరాను పునరుద్ధరిస్తామన్నారు. సాక్షి ,సిటీబ్యూరో: ఉస్మాన్సాగర్ (గండిపేట్)కాల్వ, ఆసిఫ్నగర్ నీటిశుద్ధికేంద్రం వద్ద ఫిల్టర్బెడ్ల మరమ్మతుల కారణంగా ఈ నెల 26, 27 తేదీల్లో పలు ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. దీంతో కాకతీయనగర్, సాలార్జంగ్కాలనీ, పద్మనాభనగర్, ఖాదర్బాగ్, విజయనగర్కాలనీ, చింతల్బస్తీ, హుమయూన్నగర్, సయ్యద్నగర్, ఏసీగార్డ్స్, ఖైరతాబాద్, మల్లేపల్లి, బోయిగూడా కమాన్, ఆగాపురా, నాంపల్లి, దేవీబాగ్, అఫ్జల్సాగర్, సీతారాంబాగ్, హబీబ్నగర్, ఎస్ఆర్టీ, జవహర్నగర్, పీఎన్టీ కాలనీ, సాయన్న గల్లీ, అశోక్నగర్, ఇలాచిగూడా, జ్యోతినగర్, వినాయక్నగర్, మైసమ్మబండ, ఎంసీహెచ్ క్వార్టర్స్,సెక్రటేరియట్, రెడ్హిల్స్, హిందీనగర్, గోడేఖీ కబర్, గన్ఫౌండ్రి, దోమల్గూడా, లక్డికాపూల్, మణికొండ, పుప్పాల్గూడా, నార్సింగి ప్రాంతాలకు నీటిసరఫరా నిలిచిపోనుంది. ఈ నెల 28 తిరిగి నీటిసరఫరా పునరుద్ధరిస్తామని జలమండలి అధికారులు ప్రకటించారు. -
హైదరాబాద్ బిర్యానీ.. గండిపేట్ పానీ..
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ బిర్యానీ.. గండిపేట్ పానీ ప్రపంచ ప్రసిద్ధి. గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న గండిపేట్ (ఉస్మాన్ సాగర్), హిమాయత్ సాగర్ నీటిని మినరల్ వాటర్ తరహాలో శుద్ధి చేసి రుచిని పెంచేందుకు జలమండలి కొత్త టెక్నాలజీని వినియోగించనుంది. రెండు మొబైల్ మాడ్యులర్ నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసి ఈ జలాశయాల రా వాటర్ను మినరల్ వాటర్ వలే శుద్ధి చేసి రోజూ సుమారు 52 మిలియన్ గ్యాలన్ల జలాలను గ్రేటర్ ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మంగళవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ వెల్లడించారు. సుమారు రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, పదిహేను రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. జంట జలాశయాల్లో 5 టీఎంసీల నీటి నిల్వ ఉండడంతో మహా నగరానికి ఈ వేసవిలో పానీపరేషాన్ ఉండదని స్పష్టం చేశారు. మహానగరంలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. గ్రేటర్లో ఇటీవలి కాలంలో భూగర్భ జలాలు అడుగంటడం, వేసవితాపం పెరగడంతో ట్యాంకర్ల బుకింగ్లు అనూహ్యంగా పెరుగాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి వారంలో ఏడురోజులూ రోజూ 24 గంటల పాటు కేంద్రాలు పనిచేసేలా ఫిల్లింగ్ కేంద్రాల్లో తాగునీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ నీటిని ట్యాంకర్లలో నింపడం ద్వారా కొరత ఉన్న ప్రాంతాలకు తక్షణం సరఫరా చేస్తామన్నారు. బస్తీలకు ఉచితంగా నీటిని సరఫరా చేసే 600 ట్యాంకర్లు దారితప్పకుండా వాటిపై నిరంతరాయంగా నిఘా పెడతామన్నారు. ఇక ట్యాంకర్ బుకింగ్ చేసుకునేవారికి ఆలస్యం లేకుండా చూసేందుకు ప్రస్తుతం ఉన్న 525 ట్యాంకర్ల సంఖ్యకు అదనంగా మరో వంద వాహనాలను పెంచనున్నట్లు తెలిపారు. బీరు కంపెనీలకు బంద్..పేదలకే తాగునీరు వేసవి నేపథ్యంలో నగరానికి వివిధ జలాశయాల నుంచి జరిగే నీటి సరఫరాలో 5 మిలియన్ గ్యాలన్ల నీటికి కోత పడనుంది. దీంతో బీరు కంపెనీలకు నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేసినట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. పేదలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో నిత్యం 418 మిలియన్ గ్యాలన్ల నీటిని 9.60 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్నామన్నారు. సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నగరానికి సరఫరా జరిగే 57 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా నిలిచిపోవడంతో జంట జలాశయాల నుంచి రోజూ 52 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరిస్తున్న విషయం విదితమే. దీంతో నగరానికి రోజువారీగా సరఫరా అయ్యే నీటికి కోత పడిన నేపథ్యంలో కొన్ని బ్రూవరేజెస్ సంస్థలకు నీటి సరఫరా నిలిపివేశామన్నారు. 20 అదనపు ఫిల్లింగ్ కేంద్రాలు.. ప్రస్తుతం రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ట్యాంకర్ల నీటికి అనూహ్యంగా డిమాండ్ పెరిగిందని, అందుకు అనుగుణంగా ఈ ప్రాంతాల్లో కొత్తగా 20 ఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎండీ తెలిపారు. శేరిలింగంపల్లి పరిధిలో 50 అదనపు ట్యాంకర్లు రాజేంద్రనగర్, కూకట్పల్లి, ఆసిఫ్నగర్ తదితర ప్రాంతాలకు నీటి సరఫరాకు మరో 50 ట్యాంకర్లను అదనంగా ఏర్పాటుచేసి ఈ వేసవిలో దాహార్తిని తీరుస్తామని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్రోడ్డు లోపలున్న గ్రామాల్లో 165 మంచినీటి ట్యాంకుల నిర్మాణం పనుల్లో ఇప్పటికే వంద ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యిందని.. ఈ ట్యాంకుల వద్ద కూడా ప్రైవేటు నీటి ట్యాంకర్లలో నీటిని నింపే ఏర్పాట్లు చేస్తామన్నారు. దీంతో ప్రైవేటు ట్యాం కర్ల ఆగడాలకు చెక్ పెడతామన్నారు. త్వరలో నూతన ట్యాంకర్ల పాలసీని అమల్లోకి తీసుకొస్తామన్నారు. ప్రైవేటు ట్యాంకర్ యజమానులను కూడా ఈ పాలసీ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. గృహ వినియోగదారులు(డొమెస్టిక్) ఐదువేల లీటర్ల నీటిని సరఫరా చేసే ట్యాంకర్కు రూ.500, పదివేల లీటర్ల నీటిని సరఫరా చేసే ట్యాంకర్కు రూ.1000 మాత్రమే వసూలు చేయాలని, అదనంగా వసూలు చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక శేరిలింగంపల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రస్తుతం ఘన్పూర్–పటాన్చెరు(43 కి.మీ) మధ్య ఉన్న గోదావరి రింగ్ మెయిన్–3 పైపులైన్ను మరో 8 కిలోమీటర్లు (ముత్తంగి వరకు) పొడిగించేందుకు ప్రతిపాదనలను సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదించామని ఎండీ తెలిపారు. వేసవి కార్యాచరణకు ప్రత్యేకాధికారులు నగర వ్యాప్తంగా ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ, నీటి సరఫరా వేళలను తనిఖీ చేసేందుకు 10 మంది చీఫ్ జనరల్ మేనేజర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఆయా డివిజన్ల పరిధిలో పర్యటిస్తారు. డివిజన్ స్థాయిలో అరకొర నీటి సరఫరా, బూస్టర్ పంపులు, అదనపు వాల్వ్ల ఏర్పాటు, కలుషిత జలాల నివారణ, తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా తదితర సమస్యలను పరిష్కరించేందుకు ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నిర్వహణ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. -
వందేళ్ల ఆనకట్టకు రూ. వంద కోట్లు
సాక్షి, హైదరాబాద్ : వందేళ్ల ఆనకట్ట... వంద కోట్ల రూపాయలతో కొత్తరూపు సంతరించుకోనుంది. 2020 నాటికి గండిపేట చెరువు ఏర్పడి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ చెరువును అన్నివిధాలా అభి వృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గండి పేట చెరువు అభివృద్ధికి రూ.100 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు పరిపాలన అనుమతులను ప్రభుత్వం సోమవారం మంజూరు చేసింది. హెచ్ఎండీఏ మార్గదర్శనంలో టూరిజం, రెవెన్యూ, నీటి పారుదల శాఖ, జలమండలి, టీఎస్ఎస్పీడీసీఎల్ వంటి విభాగాలు ‘గండిపేట చెరువు అభివృద్ధి టాస్క్ ఫోర్స్’గా పనిచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడూ సరస్సులో నీరు ఉండేలా చేయాలని, పర్యావరణహిత విధానాలను అనుసరిస్తూ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేలా హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అత్యాధునిక, మెరుగైన విధానాలను అధ్యయనం చేసి చెరువు చుట్టుపక్కల పచ్చదనం ఉండేలా మార్చాలని సూచించారు. ఐకాన్ గ్రీన్ రిక్రియేషనల్ టూరిజం జోన్గా మార్చి స్వతహాగా ఆదాయం సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ‘నీటి నాణ్యతపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపకుండా గండిపేట చెరువును హెచ్ఎండీఏ అభివృద్ధి చేయాలని పేర్కొంది. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, రోడ్డు నిర్మాణం, వజ్రాకారంలో ఉండేలా వైర్ ఫెన్సింగ్, వీధి దీపాలు, ఉస్మాన్సాగర్ చుట్టుపక్కల 25 కి.మీ పొడవునా ల్యాండ్ స్కేపింగ్ పనులను రూ.100 కోట్లతో చేపట్టనుంది. రివాల్వింగ్ రెస్టారెంట్, కేబుల్ కారు, హౌస్ బోట్లు, నైట్ క్యాంపింగ్ ఏరియాను పీపీపీ పద్ధతిలో లేదంటే లీజు పద్ధతిలో చేపట్టాలని సూచించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement