-
'టీడీపీ' కి మరో కొత్త తలనొప్పి! ద్వారకా రాకతో..
సాక్షి ప్రతినిధి, కడప: 'చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే ఆ ఇద్దరు 30 ఏళ్ల కిందట ప్రత్యక్ష రాజకీయ క్షేత్రంలో పోటీపడ్డారు. మూడు దశాబ్దాలుగా పరాన్నజీవులుగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. వారిని తెలుగుదేశం అధిష్టానం తెరపైకి తెచ్చింది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని నాయకులను అంటగట్టడంపై మాకు ఇదేం ఖర్మ బాబు అనడం జిల్లాలో తెలుగుతమ్ముళ్ల వంతు అయింది. చెల్లని రూకలే మహా ప్రసాదంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుండగా, శిరోభారమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.' - చెన్నంశెట్టి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడప అసెంబ్లీ నుంచి 1985 ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి గెలుపొందారు. 1989లో జనరల్ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్కు, 1991 ఉప ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా తలపడి ఓడిపోయారు. తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ పరోక్ష రాజకీయాల్లో నెట్టుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా కొనసాగారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎంపియ్యారు. అయినప్పటికీ 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనేక పదవులతో సత్కరించిన టీడీపీ పట్ల విశ్వాసం, విధేయుతతో ఉండాల్సిన సీఆర్సీ ప్రజారాజ్యంలో, అక్కడి నుంచి కాంగ్రెస్లో చేరారు. అక్కడ కూడా ఎమ్మెల్సీ దక్కించుకొని మంత్రి పదవిని చేజేక్కించుకున్నారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా పార్టీలు మారుతూ పచ్చి అవకాశవాదిగా సీఆర్సీ ముద్ర వేసుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వయోభారంతో నెట్టుకొస్తున్న ఈదశలో ఆయన పార్టీ మారి అనైతికతకు నిలువెత్తు నిదర్శనంగా ఉండిపోయారని పలువురు కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు వైఎస్సార్ దీవెనలతో.. వ్యాపార వ్యవహారిక కార్యక్రమాల్లో ఉన్న గడికోట ద్వారకనాథరెడ్డి 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆరంగ్రేటం చేశారు. అప్పటి వర్గ రాజకీయాల ఫలితంగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్రెడ్డి ఓటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గీయులు పనిచేశారు. వైఎస్సార్ చల్లని దీవెనలతో ద్వారకా లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత టీడీపీ ఛీ కొట్టింది. 1999లో టికెట్ నిరాకరించింది. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు ఉనికి చాటుకోవాలనే తపనతో తెరపైకి రావడం ద్వారకాకు సర్వసాధారణమైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తాజాగా టీడీపీ కండువా కప్పుకోవడం విశేషం. టీడీపీకి కొత్త తలనొప్పి రాయచోటి టీడీపీ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్కుమార్రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, సుగవాసి ప్రసాద్బాబు ఆశిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి వచ్చి చేరారు. ఇప్పటికే అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న నేతల మధ్యలోకి ద్వారకా రావడం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు చెప్పుకొని వెలుగొందిన ద్వారకా వైఎస్సార్సీపీకి దూరం కావడం వెనుక అవకాశవాదం ఉన్నట్లు పరిశీలకులు దెప్పిపొడుస్తున్నారు. సీఆర్సీ,ద్వారకాలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు -
ఎన్నికల గ్యారంటీలు ‘జుమ్లా’లేనా?
దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తరచుగా చెప్పే మాట తమకు అధికారం ఇస్తే ప్రజలను సాధికారులుగా చేస్తాం అన్నది. అసలు సాధికారత (ఎంప వర్మెంట్) అంటే అర్థం ఏమిటి? దీనికి విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ముందుగా శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి లేదా అతని కుటుంబాన్ని బలోపేతం చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని సామాజికంగా బలోపేతం చేయడం అన్నది సాధికారతలో ఓ భాగం. కుటుంబాన్ని బలోపేతం చేయడ మనే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారాన్ని వ్యక్తికి లేదా అతని కుటుంబానికి అందించాలి. వారు ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలి. అలా ఎంతకాలం చేయాలి? జీవితకాలంపాటు ఈ ప్రక్రియ కొనసాగాలి. కానీ, ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండేది ఐదేళ్లపాటు మాత్రమే. ఐదేళ్లు ఉండే ప్రభుత్వం ఏ వ్యక్తినైనా, కుటుంబా న్నైనా, వర్గాన్నైనా జీవితకాలం పాటు పోషించలేదు కదా? అటువంటప్పుడు వారు సాధికారులు ఎలా అవుతారు?! ఆధునిక చైనా పితామహుడిగా చెప్పుకొనే డెంగ్ జియావో పింగ్ దీనినే ఓ ఉదాహరణ ద్వారా వివరించారు. ఆకలి గొన్న వ్యక్తికి రోజూ ఓ చేప చొప్పున ఇస్తూపోతే... అది ఇచ్చినంత కాలమే అతని ఆకలి తీరుతుంది. అదే అతనికి చేపలు పట్టే విద్య నేర్పించి, ఓ వలను ఇవ్వగలిగితే అతడు తన జీవితకాలం తన పొట్టను తానే పోషించుకొంటాడు. పైగా తన కుటుంబాన్ని సైతం ఆదుకోగలుగుతాడు. ప్రభు త్వాలు ప్రజలకు సంక్షేమం ఎలా ఇవ్వాలో సూక్ష్మంగా చెప్పాడు డెంగ్ ఈ ఉదాహరణ ద్వారా. ఇదే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టడం ద్వారానే డెంగ్ తన పాలనలో చైనాను ప్రపంచంలో ఓ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించగలిగాడు. ప్రజల సమస్త వ్యక్తిగత, సామాజిక అవసరాలన్నింటినీ తామే తీర్చగలమన్న భ్రమల్ని వారిలో కల్పిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొంటున్నాయి. ఓట్ల కోసం హామీలు గుప్పించడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. అది ఇటీవలి కాలంలో మరింత వెర్రితలలు వేస్తోంది. వ్యవసాయరంగం మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణ; విద్య, వైద్యం వంటివి సామాన్యులకు అందుబాటులోకి తేవడం, శాంతి భద్రత లను పటిష్టపర్చి పారిశ్రామిక పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా నిరుద్యోగాన్ని పారద్రోలడం వంటి చర్యలు ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యం కావాలి. మహిళలు, బాలలు, వృద్ధులకు తగిన సామాజిక సంరక్షణ కల్పించడం ప్రభు త్వాల బాధ్యత. వీటిపైన దృష్టి పెట్టగలిగితే ప్రజలను సాధికారుల్ని చేసినట్లే. భారతదేశం నిద్రపోతున్న ఓ ఆర్థిక దిగ్గజం (స్లీపింగ్ జెయింట్) అని 70వ దశకంలోనే నాటి సింగపూర్ అధ్యక్షుడు ‘లీ కువాన్ యు’ అన్నారు. 1991లో పీవీ నర సింహారావు దేశ ప్రధాని అయిన తర్వాత గానీ దేశానికి పట్టిన స్తబ్ధత వదలలేదు. దశాబ్దాలపాటు పట్టి పీడించిన కొన్ని జాడ్యాలను వదిలించుకొని ఆర్థిక వ్యవస్థ వడి వడిగా అడుగులు వేస్తూ... పీవీ – డా‘‘ మన్మోహన్ సింగ్ల ద్వయం చూపిన సంస్కరణల బాటలో ముందుకు సాగిన ప్రస్థానానికి దాదాపు 3 దశాబ్దాల వయస్సు. ఈ కాలంలో దేశం చాలా రంగాలలో అభివృద్ధి చెందిన మాట నిజం. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నది అన్నది కూడా ఓ వాస్తవం. అయితే, ఈ ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? దేశంలోని సహజ వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాలన్న రాజ్యాంగ లక్ష్యాలకు, రాజ్యాంగ నిర్మాత డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు భిన్నంగా దేశ సంపద కొంత మంది పారిశ్రామిక వేత్తలకు దఖలు పడింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు మొదటి వరుసలో ఉండగా, మరో 10 మంది రెండో వరుసలో కనిపిస్తారు. అదే సమయంలో... ప్రపంచ ఆకలి సూచీలో 180 దేశాల జాబితాలో ఇండియా 165 –170 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. మనకంటే పొరుగునున్న ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ ఆకలి సూచీలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఆర్థిక దిగ్గజమైన భారత్కు ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? ఈ 3 దశాబ్దాలలో దేశ సంపద బాగా పెరిగింది. దేశ స్థూల ఉత్పత్తి 40 లక్షల కోట్లు దాటింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దేశంలో పేదలు మరింత పేదలయ్యారు. సంపన్నులు పైపైకి ఎగబాకుతున్నారు. ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన సోషలిజం స్థానంలో చాలాకాలంగా ‘పాపులిజం’ వచ్చి చేరింది. ‘అన్ని వర్గాలకూ అన్నీ’ అన్నదే పాపులిజం మూల సూత్రం. ఓట్లు రాల్చే ఈ ‘ఇజం’ చుట్టూనే నేటి రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఈ పాపులిజం ఇటీవలి కాలంలో వెర్రితలలు వేయడమే నేటి విషాదం! దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ‘జాకబ్ జుమా’ పాపులిస్ట్గా మారి దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టివేశారు. ఆ దేశ జీడిపీలో అప్పుల నిష్పత్తి 50 శాతం దాటిన నేపథ్యంలో... సొంత పార్టీ వారే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి దించి వేశారు. ‘జాకబ్ జుమా’ ఉదంతం ప్రపంచంలో అనేక దేశాలకు గుణపాఠం నేర్పింది. మొత్తం జీడీపీలో అప్పుల శాతం 24 శాతం మించరాదనీ, అదికూడా వృద్ధిరేటు 7 శాతం దాటినప్పుడే అది ఆమోదయోగ్యం కాగలదనీ ప్రముఖ ఆర్థికవేత్తలు నిగ్గు తేల్చారు. అయితే, భారత్లో కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికారం కోసం మొదట కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు, ఇతర హామీల విలువ కనీసం రెండు రాష్ట్రాల బడ్జెట్తో సమానం. ఇవి నెరవేర్చాలంటే ప్రజలపై అధికంగా పన్నులు వేయాలి, ఎఫ్.ఆర్.బి.ఎం.ను మించి అప్పులు తేవాలి. అవీ చాలక పోతే ప్రభుత్వ భూములు అమ్మాలి. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములు చాలావరకు వేలంలో పోయాయి. భవి ష్యత్ అవసరాలకోసం తిరిగి భూములు కొనాల్సిన దుఃస్థితి ఇకపై రావొచ్చు. ఇక ఎటొచ్చీ, కొన్ని పథకాలను అమలు చేయకుండా మంగళం పాడొచ్చు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారంటీలను సైతం ఎత్తివేయవచ్చు. రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఎడాపెడా హామీలు ప్రకటించడానికి కారణం అవుతోంది. మన దేశంలో రాజకీయ పార్టీల హామీల అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వడానికి నిరాకరిస్తున్నాయి. అందువల్ల ఆకాశమే హద్దుగా కొన్ని రాజకీయ పార్టీలు హామీల సునామీ సృష్టిస్తున్నాయి. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అందిస్తామని చెప్పింది. విదేశాల్లో పోగుపడిన నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి అందరి ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని బీజేపీ అగ్రనేతలు నమ్మకంగా చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీల సంగతేమిటని కేంద్రమంతి ‘అమిత్ షా’ను నిలదీస్తే, అవన్నీ ‘ఎన్నికల జుమ్లా’ అని ఆయన ఒక్క మాటతో తేల్చేశారు. అంటే, ఎన్నికల సందర్భంలో ఎన్నో గాలి వాగ్దానాలు చేస్తుంటాం. వాటిని మీరు సీరియస్గా తీసుకొంటే ఎలా? అనే అర్థంలో కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రజలు ఈ ‘జుమ్లా’ మాటలు నమ్మడం లేదనే కారణంగానే ఇపుడు గ్యారెంటీలు ఇస్తున్నారు. సదరు గ్యారెంటీలు అమలు జరుగుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఇదొక చేదు వాస్తవం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
సమాఖ్య వ్యవస్థకు ఎంతటి దుర్గతి!
గవర్నర్ల వ్యవహార శైలి కారణంగా దేశానికి సమాఖ్య వ్యవస్థను ఇచ్చిన రాజ్యాంగం స్ఫూర్తి దెబ్బతింటోంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ నియామకాన్ని భారత రాష్ట్రపతి చేస్తారు. ఆర్టికల్ 156 ప్రకారం రాష్ట్రపతి అనుగ్రహం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. దీనినిబట్టి ఎవరి కైనా ఏమి అర్థమవుతుంది? గవర్నర్ పదవిలో ఉండే వారెవరూ కేంద్ర ప్రభుత్వానికి దాసులుగా ఉండాల్సిన అవసరం లేదనేకదా? ఇందుకు సంబంధించి 1979 మే 4న సుప్రీం కోర్టు ఓ కీలకమైన తీర్పు ఇచ్చింది. ఒక యజమాని (ఎంప్లాయర్)కీ, ఒక ఉద్యోగి (ఎంప్లాయీ)కీ ఉండే సంబంధం కేంద్ర ప్రభుత్వానికీ, గవర్నర్కూ మధ్య ఉండదనీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో గవర్నర్ ఉండరనీ సుప్రీం కోర్టు ‘డాక్టర్ రఘుకుల్ కేసు’లో స్పష్టంగా చెప్పింది. అంటే, ‘గవర్నర్’ అన్నది ఓ రాజ్యాంగబద్ధమైన పదవి. ఆ స్థానంలో ఉండే వారు రాజ్యాంగబద్ధమైన విధులను మాత్రమే నిర్వహించాలి. కానీ, ఆచరణలో అలా జరుగుతోందా? గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, వారు దుర్వినియోగం చేసిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. గవర్నర్ల నియామకంలోనూ పాటించవలసిన మార్గదర్శకాలనూ, విధివిధానా లనూ తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించడం గత ఏడు న్నర దశాబ్దాలుగా కనిపిస్తోంది. గవర్నర్ను కీలుబొమ్మగా చేసుకొని ఆయా రాష్ట్రాలలో ఆర్టికల్ 356ను దుర్వినియోగ పరిచి ప్రజా ప్రభు త్వాలను కూలగొట్టిన సంఘటనలు అనేకం. కేరళ కమ్యూనిస్టు యోధుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్లో ఎన్.టి. రామారావు వరకు గవర్నర్ బాధితులు ఎందరో ఉన్నారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపర్చడం శ్రీమతి ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది. కేంద్రం– రాష్ట్రాల మధ్య ఉండే సంబంధాల సమతుల్యతపై అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు 1983లో ఏర్పాటయిన జస్టిస్ రాజేందర్ సింగ్ సర్కారియా ఐదేళ్ల తర్వాత సమర్పించిన నివే దికలో గవర్నర్ల నియామకం, వారి పనితీరుపై స్పష్టమైన సూచనల్ని చేసింది. నిజానికి సర్కారియా కమిషన్ కంటే ముందు... 1969లో అప్పటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర–రాష్ట్ర సంబంధాల మెరు గుదలపై నివేదిక ఇవ్వాలని రాజమన్నార్ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ చాలా స్పష్టంగా ‘గవర్నర్ నియామకంలో తప్పనిసరిగా రాష్ట్ర క్యాబినెట్తో సంప్రదింపులు జరపాలి’ అని చెప్పింది. కానీ, ఈ కమిటీ రికమండేషన్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం, సర్కారియా కమిషన్ కూడా ఇదే సిఫార్సు చేసింది. కానీ, కేంద్రంలో ఎవరున్నా గవర్నర్లను ఏకపక్షంగా నియమించే సంప్రదాయమే కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో పంజాబ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్ల వ్యవహారశైలి దుమారం రేపుతోంది. కొన్ని నెలల క్రితం తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగ పాఠానికి సొంతంగా మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలో ప్రసంగించడం కలవరం రేపింది. అలాగే, కొన్ని బిల్లుల్ని ఆమోదించకుండా తిప్పిపంపారు. ఇక పంజాబ్ గవర్నర్ అయితే, రాష్ట్ర అసెంబ్లీని సమావేశపర్చాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించినా అందుకు ఆయన అనుమతి ఇవ్వలేదు. దీనిపై పంజాబ్ ప్రభుత్వం విధిలేని పరిస్థితులలో సర్వోన్నత న్యాయ స్థానం గడప తొక్కింది. ‘శాసనసభ నిర్వహణకు సంబంధించిన అధి కారాలు అసెంబ్లీ స్పీకర్కు ఉండగా, వాటి నిర్వహణలో మీకు అభ్యంతరం ఏమిటి’ అని పంజాబ్ గవర్నర్ భన్వర్లాల్ పురోహిత్ తీసు కున్న చర్యను సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అంతేకాదు... ‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు’ అని తీవ్రస్వరంతో సుప్రీం కోర్టు గవర్నర్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య ఉండాల్సిన సుహృద్భావ వాతావరణం స్థానంలో రాజకీయ వైరం నెలకొని వారు ఎడమొఖం పెడమొఖంగా మారిన ఉదంతాలు గతంలో కోకొల్లలు. గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణలపై పార్లమెంట్ ఉభయ సభలలో ఎన్నో సంద ర్భాలలో వాడీ వేడీగా చర్చోపచర్చలు జరిగాయి. గవర్నర్ వ్యవస్థ ఆరోవేలు లాంటిదని, దానిని రద్దు చేయాలనే డిమాండ్ సైతం వినిపించింది. ఆశ్చర్యం ఏమంటే, గవర్నర్ వ్యవస్థ వల్ల లోగడ ఇబ్బందులు ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ... కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ‘మేము సైతం’ అంటూ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపర్చడమే చర్చనీయాంశం. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉండగా ఇటువంటి వివాదాలు చేటు చోసుకొన్న దాఖలాలు లేవుగానీ, 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గవర్నర్లను తమ ఇష్టానుసారం బీజేపీయేతర ప్రభుత్వాలపై సవారీ చేయిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ముఖ్యంగా బిల్లుల విష యంలో తమకులేని అధికారాలను ఆపాదించుకొని గవర్నర్ వాటిని ఆమోదించకుండా తొక్కిపెట్టడంతోనే ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కొందరు గవర్నర్లు పోషిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ప్రశ్నించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడం దేశంలో సమాఖ్య వ్యవస్థకు పట్టిన దుర్గతిగా రాజ్యాంగ నిపుణులు అభివర్ణించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కొన్ని అంశాలలో గవర్నర్లకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన మాట నిజం. గవ ర్నర్ తన విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం దఖలు పడింది. కానీ, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించకుండా లేదా తిప్పిపంపకుండా తొక్కి పెట్టడానికి గవర్నర్కు హక్కు లేదు. కాగా, తమ ప్రభుత్వానికి సహకరించని గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అనుచితంగా ప్రవర్తిస్తూ కక్ష తీర్చుకొంటున్న ఉదంతాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. గవర్నర్కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించకపోవడం మొదలుకొని, అసలు గవర్నర్ లేకుండానే శాసన సభ సమావేశాలు నిర్వహించుకొనేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం భారతదేశ ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది. ప్రజాస్వామ్య విలువల పతనంలో దేశం పాతాళంలోకి శీఘ్రగతిన ప్రయాణిస్తున్న వేళ... దేశం శాస్త్ర సాంకేతిక రంగా లలో అద్భుతంగా ముందుకు సాగిపోతోందనీ; చంద్రయాన్, సూర్య యాన్లతో ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్ఠ ఆకాశాన్నంటుతోందనీ కేంద్రం జబ్బలు చరుచుకొంటే ఉపయోగం ఏమిటి? సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
విదేశాంగ నీతిలో కొరవడిన మూల సూత్రాలు
యుద్ధంలో పరాజితులే తప్ప విజేతలెవరూ ఉండరని టాల్స్టాయ్ తన ‘వార్ అండ్ పీస్’ నవలలో ఎప్పుడో చెప్పాడు. చరిత్ర దానిని అనేక మార్లు రుజువు పర్చింది కూడా! ఏడాది దాటిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం, నెల రోజులుగా పాలస్తీనా (హమాస్) – ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధంలో ‘పరా జిత’... యావత్ ప్రపంచం అంటే అతిశయోక్తి కాబోదు. అయితే, పాలస్తీనా, ఇజ్రాయెల్ల మధ్య రాజుకొన్న యుద్ధ మూలాలు 40వ దశకం చివర్లోనే ఏర్పడ్డాయి. 1948లో ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ఏర్పడి, ఆక్రమిత ప్రాంతాల నుంచి అరబ్బులను తరమికొట్టడంతోనే పశ్చిమాసియాలో శాంతికి విఘాతం ఏర్పడింది. ‘పాలస్తీనా విమోచన సంస్థ’ (పీఎల్ఓ) ఏర్పడి ఆక్రమిత ప్రాంతాలను తమకు అప్పగించాల్సిందిగా ఇజ్రా యెల్ను కోరింది. అందుకు భారత్తో సహా వివిధ దేశాల మద్దతు కోరింది. అయితే, స్వప్రయోజనాలు, రాజకీయ కార ణాలతో అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఇజ్రాయెల్ను బలపర్చడమే కాకుండా, భద్రతా మండలిలో ఇజ్రాయెల్ను మందలించే తీర్మానాలన్నింటినీ వీటో చేశాయి. ఈ నేపథ్యంలోనే అరబ్బులు ఇస్లావ్ు ఏకత్వ నినాదాన్ని ఎత్తుకొని ఇస్లా మిక్ దేశాలను తమకు అనుకూలంగా చేసుకోవాలని ప్రయ త్నించారు. కానీ, మత దృష్టితో ఏకం కావడం అన్నది తాత్కాలిక ప్రయోజనాలనే తీరుస్తుందన్నది పాలస్తీనా విష యంలో అనేకసార్లు రుజువయ్యింది. యుద్ధం అన్నది ఓ ఆకస్మిక పరిణామం కాదు. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధం అయినా, పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధమైనా వాటికి చారి త్రక కారణాలు ఉన్నాయి. ఈ పరిణామాలకు గల మూల కారణాలను అర్థం చేసుకొని తగిన చొరవతో పరిష్కారానికి ప్రయత్నిస్తేనే యుద్ధాలు నివారించబడతాయి. కానీ, ఆ చొరవ ఎవరు తీసుకోవాలి? ఐక్యరాజ్య సమితా? పేరుకు తటస్థం అయినప్పటికీ ఐక్యరాజ్య సమితి కొన్ని దేశాలకు కొమ్ముకాసే జేబు సంస్థగా మారిపోయిందన్న అపప్రథను ఎప్పుడో మూటగట్టుకొంది. ఐరాస తన అంతర్జాతీయ కర్తవ్యాలను నెరవేర్చడంలో వెనుకబడింది. గాజాలోని ఆసు పత్రిపై బాంబులు పడి వందలాది మంది మరణిస్తే.. ఆ క్షణాన్నే ఇజ్రాయెల్ భూభాగంపై కాలుమోపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ బాంబులు వేసింది ఇజ్రాయెల్ సైన్యం కాదనీ, ఉగ్రవాదుల పనేననీ ఇజ్రాయెల్ తరఫున వకాల్తా పుచ్చుకొని ఆ దేశాన్ని వెనకేసుకొచ్చారు. జనావాసాలపై, ఆసుపత్రులపై, విద్యా సంస్థలపై దాడులు చేయ కూడదని ‘జెనీవా ఒప్పందం’ ఉన్నా... వాటిని ఇజ్రాయెల్ బేఖాతరు చేస్తుంటే, నోరు విప్పలేని ఐరాస ఆశక్తత అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇజ్రాయెల్పై ‘హమాస్’ చేసిన దాడిని ఎవ్వరూ సమర్థించరు. కానీ, ఉగ్రవాదుల ఏరివేత ముసు గులో గాజాలోని సామాన్య పౌరులను, ముఖ్యంగా పసి పిల్ల లను హతమార్చడాన్ని ఎవరు హర్షించగలరు?! ప్రపంచీకరణ వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలూ పరస్పర ఆధారితమైపోయిన నేపథ్యంలో... ఆ యా దేశాల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పు చోటుచేసుకొంది. ఐరాస భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి వ్యవస్థ పుట్టుకొచ్చి ఆ యా దేశాల ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను శాసించే స్థాయికి చేరుకొన్న తర్వాత, అంతర్జాతీయ పరిణామాలు కొన్ని దేశాలకు కొత్త సవాళ్లను తెచ్చి పెట్టాయి. ప్రపంచీకర ణతో లాభం పొందిన చైనా... దక్షిణాసియా దేశాల అంత ర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారింది. బలహీనదేశాలకు ఆర్థిక సాయం అందించే నెపంతో కొన్ని దేశాల విదేశాంగ ప్రతిపత్తిని దెబ్బతీసే యత్నాలు గతంలోనూ జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. కాగా, భారత్కు సంబంధించినంతవరకు పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్నీ, ఏడాదికి పైగా సాగుతున్న ఉక్రెయిన్–రష్యా నడుమ జరుగుతున్న యుద్ధాన్నీ ఏ దృక్కోణంలోంచి చూడాలన్న అంశంలో దేశంలోని పాలక పార్టీ బీజేపీకీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం అంత ర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. జవహర్లాల్ నెహ్రూ దేశ తొలి ప్రధానిగా ఉన్నప్పుడు విదేశాంగ వ్యవహా రాలను కూడా ఆయనే నిర్వహించేవారు. సహజీవన సూత్రం ఆధారంగా అంతర్జాతీయ వ్యవహారాలను చూస్తామనీ; దానికి అనుగుణమైనదే దేశ తటస్థ వైఖరి అంటూ ఆ ప్రాతిపదికననే అలీన విధా నాన్ని (నాన్ అలైన్డ్) రూపొందించారు. అంతేకాదు... వివిధ దేశాల మధ్య సహృద్భావం, అవగాహనతోనే సమస్యలు పరి ష్కారం అవుతాయితప్ప సైనిక ఒప్పందాలు (పాక్ట్స్), సైనిక కూటములలో తీసుకునే సభ్యత్వాలు పరిష్కారం అందించ వని నిర్ద్వందంగా చెప్పేవారు. నెహ్రూ అవలంబించిన విదేశాంగ విధానం నుంచి ఆ తర్వాత ఏ ఒక్క ప్రధానమంత్రీ... చివరకు వాజ్పేయి కూడా భిన్నంగా వ్యవహరించలేదు. 1999– 2004 మధ్య దాదాపు ఐదేళ్ల పాటు భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి పలుమార్లు పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. అయితే, తాజాగా ఇజ్రాయెల్పై హమాస్ దాడికి తెగబడి వందలాది మంది అమాయక ప్రజల్ని విచక్షణా రహితంగా చంపివేసిన దారుణాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఖండించి ఇజ్రాయెల్కు సంఘీభావం ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాలస్తీనాకు మద్దతు ఇస్తూ తీర్మానం చేసింది. సాధారణంగా, విదేశీ వ్యవహారాలకు సంబంధించి దేశంలోని అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కావాలి. కేంద్రానికి బాసటగా నిలవాలి. అయితే, దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల మద్దతు పొందడమే లక్ష్యంగా పాలస్తీనాకు మద్దతు ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం పట్ల అనుసరిస్తున్న తటస్థ వైఖరినే పాలస్తీనా–ఇజ్రాయెల్ అంశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇజ్రా యెల్పై హమాస్ దాడి ఓ ఉగ్రవాద చర్య. దీనిని ఖండిస్తూ ఇజ్రాయెల్కు బాసటగా నిలుస్తామని దేశ ప్రధానీ, విదేశాంగ మంత్రీ ఇరువురూ స్పష్టంగా వెల్లడించారు. మరోపక్క గాజా ప్రాంతంలోని బాధితులకు అవసరమైన ఆహారం, ఔషధా లను భారత్ తరలించడాన్నీ బాధ్యతాయుతమైన చర్యగా చూడాలి. ఇటీవల ఐరాస సర్వప్రతినిధి సభలో ‘ప్రజల భద్రత, న్యాయమైన మానవీయ బాధ్యత కోసం’ అంటూ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. దీనిపై వచ్చిన విమర్శలూ గమనార్హమే. నిజానికి, కీలకమైన ఇటువంటి అంశాలపై ఏకాభిప్రాయ సాధన కోసం పాలక బీజేపీ, అన్ని ప్రధాన రాజకీయ పక్షాలను పిలిచి సమావేశం నిర్వహించాలి. గత 8 ఏళ్లుగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని పలు రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. అమెరికా అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకోవడం, అరుణాచల్ప్రదేశ్ సరిహద్దుల్ని ఆక్ర మించిన చైనాను నిలువరించలేకపోవడం, నేపాల్తో గత దౌత్యపరమైన సంబంధాలను చెడగొట్టుకోవడం, ఇటీవల కెనడాతో సంబంధాలు క్షీణించడం వంటి అంశాలను చూపించి విదేశాంగ విధానంలో ఎన్డీఏ విఫలమైనట్లు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. అయితే, ఓట్ల రాజకీయంతో కాంగ్రెస్ పార్టీ కొన్ని వర్గాలకు కొమ్ము కాస్తోందని అది దేశ అంతర్గత భద్రతకు ముప్పు అని బీజేపీ తిప్పికొడుతోంది. కారణాలేవైనా, విదేశీ వ్యవహారాలకు సంబంధించి మును పటిలా దేశంలో రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఓ చేదు వాస్తవం! సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
గురి తప్పిన లక్ష్యాలు
పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం తుడిచి పెట్టుకుపోతుందనీ, నగదు రహిత లావాదేవీలు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని అన్నారు. కానీ నగదు లభ్యత ఆరేళ్ల కిందితో పోల్చితే రెండు రెట్లు పెరిగింది. ప్రజలు పడిన కష్టాలు సరేసరి! కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చినట్లవుతుందని చెప్పినా దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో మెరుగుదల లేదు. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు 9 శాతానికి చేరింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ఇవేనా అచ్ఛేదిన్? ఇదేనా సబ్ కా సాథ్... సబ్ కా వికాస్? జబ్బు ఒకటయితే దానికి మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంటుంది, రోగం ముదరడం తప్ప? ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో చలామణీలో ఉన్న నగదు గురించి ఇచ్చిన సమాధానం చూసిన తర్వాత ఎవరికైనా ఎన్డీఏ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై ఇటువంటి సందేహం రాక మానదు. 2016 నవం బర్ 8న రాత్రి వేళ అప్పటి ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 1,000, రూ. 500 నోట్లను తక్షణమే రద్దు చేసిన నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో నల్లధనం చాలావరకు తుడిచి పెట్టుకుపోతుందనీ, దేశంలో 2 శాతంగా ఉన్న నగదు రహిత లావాదేవీలలో పారదర్శకత పెరిగి రాబోయే ఐదేళ్లకు 50 శాతానికి చేరుతాయనీ ప్రధాని నమ్మకంగా చెప్పారు. కాగా, ఆ నిర్ణయాన్ని ఆర్థిక రంగ నిపుణులైన అమర్త్యసేన్, సౌమిత్రి చౌదరి, మాంటెక్సింగ్ అహ్లువాలియా, బీపీఆర్ విఠల్ వంటి వారు తప్పుపట్టారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలలో భయాందోళనలు కలిగాయి. ఏటీఎంల వద్ద జరిగిన తొక్కిసలాటలలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక విధాలుగా ప్రజలు కష్ట నష్టాలకు లోనయ్యారు. అయితే, నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ విప్లవం రానున్నదని ఘనంగా సెలవిచ్చారు. కానీ ఈ 6 సంవత్సరాలలో జరిగిందేమిటి? 2016 నవంబర్ 8 నాటికి దేశంలో 16 లక్షల 41 వేల 571 కోట్ల రూపాయల విలువ గల కరెన్సీ చలామణీలో ఉండగా, 2022 డిసెం బర్ 2 నాటికి 31 లక్షల 92 వేల 622 కోట్ల రూపాయల నగదు చలామణీలో ఉందని నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో నగదు లభ్యత రెండు రెట్లు పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని అర్థమవుతూనే ఉంది. ఇక, నల్లధనం ఏ మేరకు కట్టడి అయిం దనే దానిపై లెక్కలు లేవు. ప్రజా జీవితాలకు సంబంధించి తీవ్రమైన నిర్ణయం తీసుకొనే సందర్భంలో పర్యవసానాలను శాస్త్రీయంగా అంచనా వేయకపోతే కలిగే నష్టాలు ఏమిటో ‘పెద్దనోట్ల రద్దు’ నిర్ణ యంతో తెలిసొచ్చింది. అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలలో పాలకులు తీసుకొనే సంస్కరణలు ప్రజాహితానికి అనుగుణంగా ఉండాలి. 2004–2014 మధ్య కాలంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశం తిరోగమనంలో పయనించిందనీ, అందువల్ల తాను కొన్ని కఠిన నిర్ణయాలు, కఠోర విధానాలతో గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించి పరుగులు పెట్టిస్తాననీ 2014 జూన్ మొదటివారంలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే నరేంద్ర మోదీ దేశ ప్రజలకు స్పష్టం చేశారు. నిజానికి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పదేళ్ల యూపీఏ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గానే ఉన్నాయి. ప్రపంచ సంక్షోభం ఏర్పడిన 2008 ఆర్థిక సంవత్సరం మినహా మిగతా 9 ఏళ్లు దేశ స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు సగటున 8 శాతం మేర నమోదయింది. ఆ తర్వాత 2014–2022 మధ్య 8 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క 2020–21లో మాత్రమే అత్యధి కంగా 8.95 శాతం మేర జీడీపీలో వృద్ధిరేటు కనిపించింది. అది కూడా అంతకుముందు ఏడాది కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లో లమై జీడీపీ వృద్ధిరేటులో క్షీణత కనిపించింది. దానితో పోల్చుకుంటే 2021–22లో ఆర్థిక వ్యవస్థ కుదుటపడటం వల్ల అధిక వృద్ధిరేటు నమోదయింది. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 2 ట్రిలియన్ల డాలర్ల మేర ఉంది. గ్లోబల్ ర్యాకింగ్స్లో అప్పుడు భారత్ది 10వ స్థానం. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్లతో భారత్ 5వ స్థానం ఆక్రమించడం చెప్పుకోదగ్గ ఘనతే. కానీ, ఇతర సూచికల్లో భారత్ ఏ విధంగా పురోగమించింది? వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను అతిపెద్ద పన్నుల సంస్కరణగా చెప్పుకొన్నారు. చేనేత, చివరకు ప్రాణాధార ఔషదాల మీద కూడా జీఎస్టీ విధించడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలపై పరోక్షంగా ఆర్థిక భారం పడుతున్నది. కేంద్రానికి సమకూరే ఆదాయాన్ని దామాషా పద్ధతిలో రాష్ట్రాలతో పంచుకొనే విధానానికి కూడా ఎన్డీఏ చెల్లుచీటి పాడింది. కొన్ని రంగాలపై ఎన్డీఏ ప్రభుత్వం విపరీతంగా సెస్సు (ప్రత్యేక పన్ను) విధిస్తున్నది. గతంలో కూడా పెట్రోల్, డీజిల్, రహదారులు మొదలైన రంగాలలో ‘సెస్సు’లు ఉన్న మాట నిజమే. కాకపోతే ఆ మొత్తం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఉదాహరణకు 2013–14 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సెస్సు రూపంలో లభించిన మొత్తం రూ. 73,880 కోట్లు కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి కేంద్రానికి సెస్సు ద్వారా పోగుపడిన మొత్తం రూ. 2,96,884 కోట్లు. అంటే గత 7 ఏళ్లల్లో సెస్సుల ద్వారా కేంద్రం అంతకుముందు కంటే 3 రెట్ల మొత్తాన్ని తన ఖజానాలో వేసుకుంది. ఇందులో రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నిజానికి, ‘సెస్సు’ను ఏ రంగం నుంచి అయితే వసూలు చేస్తారో, ఆ మొత్తాన్ని ఆ రంగం అభివృద్ధికే ఖర్చు చేసే సంప్రదాయం ఉంది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం సెస్సు నిధులను ఇతర రంగాలకు దారి మళ్లిస్తోంది. ఒక్క సెస్సుల రూపంలోనే దేశ ప్రజలు రోజుకు రూ. 813 కోట్లు మేర కేంద్రానికి చెల్లిస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ గతంలో 30 శాతం ఉండగా దానిని 22 శాతానికి కుదించారు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చి నట్లవుతుందని చెప్పినప్పటికీ దానికి ఫలితాలు కనబడటం లేదు. గత 8 ఏళ్లల్లో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిలో చెప్పుకోదగ్గ మెరుగుదల నమోదు కాలేదు. ఎగుమతుల రంగంలో ఏటా సగటున 100 బిలి యన్ల డాలర్ల మేర పెరుగుదల నమోదు అవుతున్నప్పటికీ, సాపేక్షంగా దిగుమతులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా, ‘బ్యాలెన్స్ ఆఫ్ పేమెం ట్స్’లో లోటు ఏర్పడి రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. 2014లో డాలర్ విలువ 52 రూపాయలుండగా, ప్రస్తుతం 82 ఉంది. రెండుళ్లుగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా నుంచి ఇప్పు డిప్పుడే క్రమంగా కోలుకొంటున్నప్పటికీ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగిత ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. 2014లో నిరుద్యోగిత రేటు 5.4 శాతం ఉండగా, అది ఇప్పుడు దాదాపు 9 శాతానికి చేరినట్లు సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఈఈ) తెలి పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఉండటం గతంలో ఎన్నడూ లేదు. ప్రతియేటా దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో 2 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని మోదీ ఇచ్చిన హామీ నీటిపై రాతగానే మిగిలిపోయింది. మరోవైపు దేశంలో సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగు తోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల సంఖ్య 100 దాటినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. 2014–15లో దేశంలో సగటు తలసరి ఆదాయం రూ. 86,454 కాగా, 2020–21 నాటికి అది రూ. 1.32 లక్షలకు చేరింది. తలసరి ఆదాయంలో పెరుగుదల సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదలకు నిజమైన సూచికగా భావించవచ్చునా? సంపన్నులు మరింత సంపన్నులవుతు న్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు. కనుక తలసరి ఆదాయ గణాంకాలు నిజమైన అభివృద్ధికి సూచికలు కావు. మరోవైపు రైల్వేలు, ఓడరేవులను ప్రైవేటుపరం చేసిన కేంద్రం త్వరలోనే 25 విమానాశ్ర యాలను లీజుల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి సిద్ధం అయింది. ఇవన్నీ గమనించినప్పుడు భారత ఆర్థిక రంగం ‘మేడి పండు’లాగే కనిపిస్తోంది. దేశంలో పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తు లను పెంచకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చ కుండా, విలువైన సహజ వనరుల్ని ఉపయోగించుకోకుండా ఆర్థిక వ్యవస్థ ఎలా పట్టిష్టం అవుతుంది? స్థిరమైన పెట్టుబడులు, ఎగుమ తులు, విదేశాలతో మెరుగైన వాణిజ్య సంబంధాలు, సరళీకృతమైన పారదర్శక ఆర్థిక విధానాలు, భారం పడని పన్నుల విధింపు తదితర చర్యలు మాత్రమే దేశ ఆర్థిక రంగాన్ని సుస్థిరపర్చగలవు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement