‘గడప గడపకు ప్రభుత్వం’ ఫలితాలు షురూ

C Ramachandraiah article on Gadapa Gadapaku Mana Prabhutvam Program - Sakshi

విశ్లేషణ

‘గడప గడపకు ప్రభుత్వం’ అన్నది ఓ విశిష్ట కార్యక్రమం. దీనిని నిరంత రాయంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంకల్పం ఆహ్వానించదగినది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు అందుతాయి. ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధుల పని తీరుతోపాటు పార్టీ నేతల భాగ స్వామ్యం, అప్పగించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో వారు చూపుతున్న శ్రద్ధ తదితర అంశాలను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్షించడమేకాక, తన అభి ప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. పనితీరు సరిగాలేని పార్టీ నేతల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. పనితీరు మార్చుకోకుంటే తప్పిస్తానని నిష్కర్షగా చెబు తున్నారు. ఇవన్నీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులలో సరి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ప్రజలకిచ్చిన హామీలలో 97 శాతం మేర నెరవేరు స్తున్నందున ప్రజలలో సంతృప్తి స్థాయిలు ఎక్కువగా ఉంటా యని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంచనా. అయితే, ప్రజల సంతృప్తి అన్నది మొత్తంగా ప్రభుత్వంపైనా, తాము ఎన్ను కొన్న ప్రజాప్రతినిధి పనితీరు పైనా, అధికార యంత్రాంగం స్పందనపైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల తానొక్కణ్ణే కష్టపడితే సరిపోదనీ, ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్న దాంట్లో అబద్ధం ఏముంది? ఎన్ని పనులు చేసినా ఇంకా చేయాల్సి నవి ఉంటూనే ఉంటాయి. అలాగే సమన్వయ లోపంతో కొన్ని పనులు జరగడం ఆలస్యం అవుతుంది. ‘గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం’లో అక్కడక్కడ ఎమ్మెల్యేలకు ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతున్న మాట నిజమే. అయితే, దాని గురించి బెంబేలు పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఏ పాలకుడి వద్ద రాత్రికిరాత్రే అద్భుతాలు సృష్టించే మంత్ర దండం ఉండదు. కష్టపడాల్సిందే. అందరి సహకారం స్వీకరించాల్సిందే. అప్పుడే ఫలితాలు అందుతాయి. 

రాష్ట్రంలో అమలు జరుగుతున్న ‘నవరత్నాల’ను ఒక్క ఏడాది కంటే ఎక్కువ కాలం కొనసాగించలేరని కొందరు జోస్యం చెప్పారు. కానీ, కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ రథ చక్రాలు ఆగలేదు. ఏ ఒక్క పథకమూ కుంటు పడలేదు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 97 శాతం పైగా అమలు చేయడం అన్నది బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు. ఒకట్రెండు హామీల విష యంలో వాటిని యుధాతథంగా అమలు చేయ డానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించే స్థితిలో లేనందువల్ల వాటిని మెరుగైన విధానంలో అమలు చేస్తామని ధైర్యంగా, నిజాయితీగా చెప్పగలగడం కూడా గతంలో లేదు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దాడి చేస్తున్న వారి ప్రధాన ఆరోపణల్లో ఒకటి రాష్ట్రంలో సంపద సృష్టి జరగడం లేదన్నది. ఆంధ్రప్రదేశ్‌లో 2 ఎకరాల భూమి విలువకు ప్రస్తుతం తెలంగాణలో 1 ఎకరం భూమి మాత్రమే వస్తుందట. ఈ ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర ప్రదేశ్‌లో భూముల విలువ పడిపోయిందంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి, ఇదొక డొల్ల వాదన. వీరి దృష్టిలో సంపద అంటే కేవలం రియల్‌ ఎస్టేట్‌. తెలం గాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో స్థిరపడిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అమరావతి ప్రాంతంలో కోట్లు కుమ్మ రించి భూములు కొన్నారు. వాస్తవిక అంతర్గత విలువ (ఇంట్రిన్సిక్‌ వాల్యూ) లేకుండా కేవలం ప్రచారార్భాటంతో విలువను పెంచి అదే సంపద సృష్టిగా చెప్పుకొన్నారు. నిజానికి అసలైన అభివృద్ధి ఏమిటన్నది ఈ 3 ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమా ణాలు మెరుగుపర్చడమే సంపద సృష్టి అని నిరూపించారు. పెట్టుబడిదారీ విధానంలో ప్రభుత్వాలు వ్యాపారాలు చేస్తాయి. లాభాలు కోసం వెంపర్లాడతాయి. అదికూడా తమ ప్రయోజనాలు కాపాడే వర్గాల కోసం. కానీ, జగన్‌ విధానం వ్యక్తిగతమైన లాభాలు అందించే వ్యవస్థను ప్రోత్సహించడం కాదు. అన్ని వర్గాలను, ప్రత్యేకించి దశాబ్దాలుగా అణగారి ఉన్న వర్గాలను బాగు చేయడం. వారిని ఆర్థికంగా, సామా జికంగా, రాజకీయంగా సాధికా రుల్ని చేయడం. నిజమైన అభివృద్ధి, నిజమైన సంపద సృష్టి అంటే అదే.

కానీ, ఈ అభివృద్ధి నమూనాను కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమను తాము ఎలీట్‌ వర్గాలుగా భావిస్తూ సమాజంలో ఉన్నత విద్య, వైద్య సదుపాయాలు అనుభవించడం తమ జన్మహక్కుగా, అన్ని రంగాలలో పైచేయి తమదే ఉండాలన్న ఫ్యూడల్‌ మనస్తత్వంతో... పేదలు, బడుగు బలహీన వర్గాలవారు సామాజిక, ఆర్థిక నిచ్చెనమెట్ల ద్వారా పైకి చేరుకొంటుంటే చూచి సహించ లేకపోతున్నారు. ఎలీటెస్ట్‌ థియరీ (శ్రేష్టవర్గ సిద్ధాంతం) ప్రకారం వారు తమకు కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆపాదించు కొంటారు. వారు ఇతర వర్గాల ప్రజలతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. కానీ, ఆ వర్గాల ఓట్లతోనే అధికారం సంపాదిం చాలని చూస్తారు.

ఉదాహరణకు అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ఎలీట్‌ వర్గాలు నిరాకరించాయి. రాజ ధాని ప్రాంతాన్ని కూడా ఓ గేటెడ్‌ కమ్యూనిటిలా తయారు చేయాలనుకొన్నారు. అందువల్లనే... అమరావతిలో పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ‘సామాజిక సమతుల్యత’ దెబ్బతింటుందని పేదలను, బలహీన వర్గా లను అవమానపర్చే విధంగా చెప్పారు. అంటే ప్రభుత్వం అన్నది కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే పని చేయాలా? లేక జగన్‌ విధానంలో లాగా పేదల కోసం పని చేయాలా? రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి అన్నది కొద్దిమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు పరిమితం చేయాలా? లేక అన్ని వర్గాల ప్రజలకూ అందించాలా? 

గత 3 ఏళ్లలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ విజయాలు చెప్పు కోవడానికి చాలానే ఉన్నా... అన్నింటిలోకెల్లా భూమిలేని నిరుపేదలకు 36 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం అన్నది ఓ చారిత్రాత్మక విజయం. స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వ లేదు. ఇపుడు రాష్ట్ర ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అనుసరిస్తున్న ప్రజాకేంద్రక అభివృద్ధి నమూనాకు మద్దతు పలకడం. సామాన్యులు, పేదలూ 2024లో కూడా వైసీపీనే గెలిపించాలి. పెట్టుబడిదారీ వర్గా లకు మరోసారి కోలుకోలేని గుణపాఠం నేర్పాలి.


సి. రామచంద్రయ్య 
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top