చంద్రబాబు అవినీతి జేడీకి కనిపించట్లేదా?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయలేదన్న కారణంతోనే చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సీ రామచంద్రయ్య ఆరోపించారు. జేడీ లక్ష్మీనారాయణ ద్వారా వైఎస్ జగన్ను జైల్లో పెట్టించడానికి చంద్రబాబే కారణమని, ఇందుకు ఆయన టీడీపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారమే నిదర్శమని అభిప్రాయపడ్డారు. జేడీ లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు సహకరించారని, దానికోసమే ఆయన మేలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం రామచంద్రయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న అవినీతి జేడీకి కనిపించట్లేదా అని ప్రశ్నించారు.
రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే తెలిసిందని అందుకే ఇలాంటి చిల్లర రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అవుతారన్న విషయం ఆయన చేపట్టిన పాదయాత్రలోనే స్పష్టమైందని మరోసారి గుర్తుచేశారు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసుకున్నాడని, ఇక ఏమీ చేయలేక ఓట్ల తొలగింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుక ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో సోనియా గాంధీ, జగన్ ఒక్కటన్న చంద్రబాబు ఇప్పుడేమో మోదీ, జగన్ ఒక్కటని అంటు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు మీడియాను నమ్ముకున్నారని, వైఎస్ జగన్ ప్రజలను నమ్ముకున్నారని స్పష్టంచేశారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆయన జోస్యం చేప్పారు.