కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న క్షేత్రం పసుపువర్ణమైంది.పట్నం వారం సందర్భంగా భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. పంచవర్ణాల పెద్ద పట్నాన్ని దాటుకుంటూ..అగ్నిగుండం ప్రవేశం చేస్తూ మేడలమ్మ,కేతమ్మ సమేత మల్లికార్జునుడిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందారు.
మల్లన్న క్షేత్రంలో జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.ఆలయ తోటబావి ప్రాంగణంలో సోమవారం హైదరాబాద్కు చెందిన యాదవ భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్తోపాటు అర్చకులు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పెద్దపట్నం వరకు చేర్చి యాదవ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అర్చకులు అగ్నిగుండాలు దాటిన తర్వాత గ్యాలరీలలోని భక్తులు, శివసత్తులు యాదవ భక్తులు అగ్నిగుండంలను దాటూతూ స్వామిని దర్శించుకున్నారు.


