రజకులకు మహర్దశ

Greatness For Rajakaas - Sakshi

రజకుల సమస్యలు పరిష్కరిస్తామని జగన్‌ హామీ

ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై బీసీ కమిషన్‌ వేస్తామని ప్రకటన

2008లో హామీ ఇచ్చి అమలు చేయని చంద్రబాబు 

సాక్షి, ప్రొద్దుటూరు : పుట్టినప్పటి నుంచి మరణించే వరకు పుట్టెడు చాకిరి చేసే రజకుల బతుకులు నేడు దుర్భరంగా మారాయి. ఒకప్పుడు బండెడు పని ఉండేది. నేడు  పనిలేక ఇతర వృత్తుల వైపు పయనిస్తున్నారు. తరతరాలుగా రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నా తమ జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఈ వృత్తితో జీవనం సాగించలేక మానుకొని.. ఇతర వృత్తులను నమ్ముకుని ఆధారపడ్డారు. ప్రతి రజకుడి ఇంటిలో ఒకరు కాకుండా కుటుంబ సభ్యులంతా కలసి వృత్తి పని చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో తమకు ఇచ్చే కూలి (మేర) అధ్వానంగా ఉంటోందని వారు అంటున్నారు.  జిల్లాలో దాదాపు లక్ష 69 వేల మంది రజకులు వృత్తినే ఆధారంగా చేసుకుని బతుకుతున్నారు. చాలా గ్రామాల్లో దుస్తులు ఉతకడంపై సమస్యలు ఏర్పడటంతో.. రజకులను సాంఘిక బహిష్కరణ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని సంఘ నాయకులు చెబుతున్నారు. రాజుపాళెం మండలంలోని టంగుటూరు గ్రామంలో కూడా ఈ సమస్య తలెత్తినప్పుడు అప్పటి కలెక్టర్‌ జయేష్‌రంజన్‌ జోక్యం చేసుకుని పరిష్కరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 17న ఏలూరులో బీసీ గర్జన సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో రజకులకు సంబంధించి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. దీంతో రజకుల్లో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. 

తమను ఎస్సీ జాబితాలోకి చేర్చే అంశంపై బీసీ కమిషన్‌ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రజకులు డిమాండ్‌ చేస్తున్నారు.  2017 నవంబర్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 5వ రోజున ప్రొద్దుటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్‌ రజకుల సమస్యలపై స్పందించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంతో గట్టిగా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తాము రజకులను ఎస్సీ జాబితాల్లో చేర్చుతామని ప్రకటించారు.

సీఎం చంద్రబాబు బీసీ కమిషన్‌ వేయకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ముగ్గురు ప్రొఫెసర్లతో అధ్యయన కమిటీ వేశారు. వారు కేవలం రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే పర్యటించారు. మిగతా జిల్లాలో వీరు పర్యటించడానికి బడ్జెట్‌ కేటాయించలేదు. హంగూ, ఆర్భాటాల కోసం రూ.కోట్లు ఖర్చుపెడుతున్న చంద్రబాబు ఈ కమిటీకి కనీసం రూ.50 లక్షలు కూడా కేటాయించకపోవడాన్ని చూస్తే తమపై ఎంత మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతోందని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీతో భాగస్వామ్యంగా ఉంటూ 20 మంది ఎంపీలు కలిగిన చంద్రబాబు ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని వారు అంటున్నారు. జగన్‌ ఇచ్చిన మాట తప్పడని వారు పేర్కొంటున్నారు.

2008లో హామీ ఇచ్చి అమలు చేయని చంద్రబాబు 
రజకులు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వారిపై చిన్నచూపు చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏనాటి నుంచో డిమాండ్‌ ఉంది. దేశంలోని 17 రాష్ట్రాలతోపాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధానం అమలు అవుతోంది. వారిలాగే తమను అదే జాబితాలో చేర్చాలని తరతరాలుగా రజకులు డిమాండ్‌ చేస్తున్నారు. 2008లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద రజక గర్జన సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. 2016లో హైదరాబాద్‌లో జరిగిన చివరి అసెంబ్లీ సమావేశాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని గవర్నర్‌ ప్రసంగంలో తెలిపారు. 1999, 2004 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెలుగుదేశం పార్టీ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని 
ప్రకటించింది. కానీ అమలు చేయలేదు. 

రజక సంఘం డిమాండ్లు

ఎ భారతదేశంలోని 17 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. 
ఆంధ్రప్రదేశ్‌లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. 
ఎ 50 ఏళ్లు నిండిన రజక వృత్తిదారులకు నెలకు రూ.2 వేల పింఛన్‌ ఇవ్వాలి. 
ఎ రజకులపై జరిగే దాడులను అరికట్టడానికి రజక రక్షణ 
చట్టం అమలు చేయాలి.
ఎ రజక ఫెడరేషన్‌ స్థానంలో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించాలి. 
ఎ రజక వృత్తి చెరువులు, ధోబీఘాట్ల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడి.. రజక కమ్యూనిటీ హాళ్లు, వీలైన చోట రజక కాలనీలను ఏర్పాటు చేయాలి. 
ఎ ధోబీఘాట్ల నిర్మాణ పనులను నామినేషన్ల కింద 
రజక సొసైటీలకు అప్పగించాలి. 
ఎ టీటీడీ, ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాల్లో రజక వృత్తిని కాంట్రాక్టర్లకు కాకుండా రజక వృత్తిదారులకే కేటాయించాలి.
ఎ ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న 
ధోబీ పోస్టుల్లో రజకులనే నియమించాలి. 
ఎ రాజధాని ప్రాంతంలో స్థలం కేటాయించి రజక భవన్‌
నిర్మించాలి.
ఎ రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. 

జిల్లాలో రజకుల జనాభా 

నియోజకవర్గం      జనాభా 
ప్రొద్దుటూరు  20 వేలు
జమ్మలమడుగు 18 వేలు
బద్వేలు  20 వేలు
కడప  18 వేలు
మైదుకూరు  15 వేలు
పులివెందుల    15 వేలు
కమలాపురం  15 వేలు
రాయచోటి  18 వేలు
రాజంపేట  15 వేలు
రైల్వేకోడూరు  15 వేలు
మొత్తం  1,69,000

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top