జోరందుకున్న మిరప సాగు | chilli cultivation increased | Sakshi
Sakshi News home page

జోరందుకున్న మిరప సాగు

Sep 18 2014 12:47 AM | Updated on Sep 2 2017 1:32 PM

పంట నాటుకు ముందు మూడుసార్లు దుక్కి దున్ని రెండు సార్లు గుంటక కొట్టాలి.

అనుకూలమైన నేలలు: నల్లరేగడి, ఒండ్రు, ఎర్రమట్టి, ఇసుక నేలలు.

 నేల తయారీ: పంట నాటుకు ముందు మూడుసార్లు దుక్కి దున్ని రెండు సార్లు గుంటక కొట్టాలి.

 విత్తనశుద్ధి: మొదటి సారి ఒక కిలో విత్తనానికి గ్రామున్నర టైసోడియం, ఆర్థోపాస్పేట్, రెండోసారి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, మూడోసారి 3 గ్రాముల కాప్టాన్ మందును కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.

 నారు పెంచడం: ఎత్తై నేలను చదను చేసి విత్తనాలు వేసుకోవాలి. నారు 12-15 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత పది లీటర్ల నీటిలో రెండున్నర మిల్లీలీటర్ల ఫైటోలిస్ మందును కలిపి పిచికారీ చేయాలి.

 పంట వేసే విధానం: వర్షాధార పంట కాబట్టి తేమశాతం అధికంగా ఉన్నప్పుడూ కానీ వర్షం పడిన సమయాల్లో కానీ ఒక తాడు సాయంతో అరగజం దూరంలో వరుస క్రమంలో తగినన్ని నారు పోచలను నాటుకోవాలి.

 అనంతరం తగినంత మోతాదులో నత్రజని, పొటాషియం, భాస్వరం కలిపి చల్లాలి. కొన్ని రోజులకు చేనులో వరుస సాళ్లలో దంతెలు పట్టడం, కలుపు తీయడం చేస్తూ పిచ్చి మొక్కలను తీసేయాలి.
 
పంటలో గడ్డి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 పంటకు ఆశించే తెగుళ్లు
 ట్రీప్స్, ఎఫైడ్స్ (వెంట్రుక పురుగులు) వంటివి ఆశిస్తే మోనోక్రొటోఫాస్ లేదా కార్బైల్ మందును తగినంత మోతాదులో నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి.
 
బూజు, బూడిద తెగులు, మచ్చలు ఏర్పడితే ఆంత్రోసిన్ మందును నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం వేళల్లో స్ప్రే చేయాలి.
 కలుపు తీయడం
 
 పంటలో ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి కలుపు తీయడం చాలా అవసరం.
 
కలుపు తీసేముందు చెట్టు మొద ళ్లకు మట్టిని ఎగదోయాలి. కలుపుతీతకంటే ముందుగా దంతెలు పడితే మరింత మంచిది.
 
కలుపును నిర్లక్ష్యం చేస్తే తెగుళ్లు ఆశించడంతోపాటు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
 
నీటి తడులిస్తే మేలు: సకాలంలో వర్షాలు పడకపోతే నీటి సదుపాయం ఉన్న రైతులు పంటకు తడులు అందించొచ్చు. దంతెపట్టి, కలుపు తీశాక నీటిని పెడితే పంట ఎదుగుదల బాగుంటుంది. ఇలా చేస్తే దిగుబడిని కూడా పెరుగుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement